సహకరించాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కొవిడ్-19 ఉధృతి కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరు రోజుల లాక్డౌన్ విధించవలసి వచ్చిందని, లాక్డౌన్ కాలంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. సోమవారం రాత్రి 10 గంటలకు ప్రారంభమైన లాక్డౌన్ ఏప్రిల్ 26వ తేదీ ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుంది. ఢిల్లీలో నేటి నుంచి లాక్డౌన్ ప్రారంభమైందని, ప్రజల ఆరోగ్యం, భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్న దృష్ట్యా ప్రభుత్వానికి సహకరించి ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని కేజ్రీవాల్ మంగళవారం ట్వీట్ చేశారు. లాక్డౌన్ నుంచి నిత్యావసర సర్వీసులు, కార్యకలాపాలకు మినహాయింపు ఇచ్చారు. 50 మంది అతిథులతో పెళ్లిళ్లకు, అంత్యక్రియలలో పాల్గొనేందుకు 20 మందికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాక్డౌన్ కారణంగా మంగళవారం ఢిల్లీ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. నివాస ప్రాంతాలలో ప్రజలు ఇళ్లకే పరిమితిమయ్యారు.