Saturday, April 27, 2024

‘మేజర్’కు దేశమంతా మంచి పేరు వచ్చింది

- Advertisement -
- Advertisement -

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు, విమర్శకులు ఇండియన్ సినిమా చరిత్రలో ‘మేజర్’ చిత్రం ఒక మైలురాయి అని కితాబిచ్చారు. చాలామంది యూత్ మేజర్ సందీప్‌లా సైనికులు కావాలని ఆసక్తి చూపుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు అనురాగ్, శరత్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
ఆ రెండు నిర్మాణ సంస్థలతో కలిసి…
మాకు ఛాయ్ బిస్కట్, ఏప్లస్ ఎస్ మూవీస్ అనే రెండు నిర్మాణ సంస్థలున్నాయి. ఇక ‘మేజర్’ సినిమా గురించి నమ్రతతో మాట్లాడగా ఆమెకు ఈ కథ బాగా నచ్చింది. దీంతో మహేష్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంది. అలాగే సోనీ సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా చేరింది.
దేశమంతా పేరు…
మేము గౌరవ ప్రదమైన సినిమా చేశాం. ‘మేజర్’కు దేశమంతా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకు టైటిల్స్ చివరలో పడతాయి. అప్పటివరకు ప్రేక్షకులు ఉన్నారంటేనే సినిమా సక్సెస్ అయినట్లు లెక్క.
అప్పుడు ఆలోచన మారింది…
మొదట తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా తీయాలనుకున్నాం. మేజర్ సందీప్ తల్లిదండ్రులను కలిశాక ఆలోచన మారింది. వారు కేరళలో ఉంటారు. “మాకు తెలుగు, హిందీ రాదు, మేము చూడలేం”అని వారు అన్నారు. అప్పుడు మాలయాళంలో ఈ సినిమాను డబ్ చేశాం.
తదుపరి చిత్రాలు…
ఛాయ్ బిస్కట్ ఫిలిం బ్యానర్‌లో సుహాస్‌తో ‘రైటర్ పద్మభూషణ్’, ‘మేం ఫేమస్’ అనే సినిమాలు చేస్తున్నాం. అలాగే తొట్టెంపూడి వేణు లీడ్ రోల్‌లో ఓ సినిమా, సూర్య అనే కొత్త కుర్రాడితో మరో సినిమా చేస్తున్నాం. అవి త్వరలో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాం.

Major Movie producers talks with Media

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News