Monday, April 29, 2024

మోడీ నియంతృత్వ పాలనకు ఇది పరాకాష్ఠ

- Advertisement -
- Advertisement -

విపక్ష ఎంపీల సస్పెన్షన్‌పై ఖర్గే ఆగ్రహం

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలు పతాక స్థాయికి చేరుకున్నాయని, అసమ్తతిని అణచివేసి చర్చలు లేకుండానే ముఖ్యమైన బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. సోమవారం 33 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కు గురైన వెంటనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ ఈ నియంతృత్వ ప్రభుత్వం అన్ని ప్రజాస్వామిక నిబంధనలను చెత్తబట్టులో పడేసి పార్లమెంట్‌కు జవాబుదారీతనాన్ని తుంగలో తొక్కిందని విమర్శించారు.

మొదట చొరబాటుదారులు పార్లమెంట్‌పై దాడి చేశారు. తరువాత మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌పైన, ప్రజాస్వామ్యంపైన దాడి చేసింది. 47 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా ఈ నియంతృత్వ మోడీ ప్రభుత్వం అన్ని ప్రజాస్వామిక నిబంధనలను చెత్తబుట్టలో పడేసింది అని ఎక్స్(పూర్వ ట్విట్టర్)లో రాసిన పోస్ట్‌లో ఖర్గే ఆరోపించారు. ఇదివరకే 13 మంది ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాము రెండు న్యాయబద్ధమైన డిమాండ్లను మాత్రమే ముందుకు తెస్తున్నామని ఖర్గే తెలిపారు.

క్షమించవీలులేని పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి పార్లమెంట్ ఉభయ సభలలో ఒక ప్రకటన చేయాలని, అదే అంశంపై పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చ జరగాలని ఆయన తమ డిమాండ్లను వివరించారు. ప్రధాన మంత్రి ఒక వార్తాపత్రికకు ఇంటర్వూ ఇస్తారని, కేంద్ర హోం మంత్రి టివి ఛానళ్లలతో మాట్లాడతారని, కాని భారత ప్రజలు ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్‌కు మాత్రం వారు జవాబుదారీ కారని ఖర్గే వ్యాఖ్యానించారు. ఇక ప్రతిపక్షం లేని పార్లమెంట్‌లో మోడీ ప్రభుత్వం పెండింగ్ బిల్లులన్నిటినీ ఎటువంటి చర్చ లేకుండా విచ్చలవిడిగా ఆమోదించుకోవచ్చని, అసమ్మతిని అణచివేయవచ్చని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడైన ఖర్గే విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News