రవీంద్రభారతి వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం
జైతెలంగాణ అంటూ నినాదాలు
పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం
వెంటనే మంటలు ఆర్పేసి ఆస్పత్రికి తరలించిన పోలీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తనకు న్యాయం జరగలేదని ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన నగరంలోని రవీంద్రభారతి వద్ద గురువారం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా, కడ్తాల్ గ్రామానికి చెందిన రాములు ఉపాధ్యాయ శిక్షణ కోర్సును పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటనలు రాకపోవడంతో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. కరోనా రావడంతో పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో చేసేందుకు పనిలేక బతకడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే మనస్థాపం చెంది తెలంగాణ వచ్చినా తనకు న్యాయం జరగలేదని అరుచుకుంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మంటల్లో కాలుతూ.. జై తెలంగాణ అంటూ నినాదాలు ఇచ్చాడని చెప్పారు. సిఎం కెసిఆర్ తనకు న్యాయం చేయాలని అరిచినట్లు స్థానికులు తెలిపారు. అసెంబ్లీ విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి మంటలు ఆర్పి చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ సంఘటన జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Man Suicide attempt at Ravindra Bharathi