హైదరాబాద్: వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, గ్రామాలు స్వయం సమృద్ధ్ధి సాధించేలా కృషిచేస్తున్న 150 మందిని మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా సత్కరించడం ముదావహమని మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్ధికవేత్త, భారత దేశ ఆర్ధిక సంస్కరణల మహాత్ముడు డాక్టర్ మన్మోహన్సింగ్ అన్నారు. గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలిజీ (జీకాట్) ఆధ్వర్యంలో అందించిన గ్రామోదయ బంధుమిత్ర పురస్కరాలను ప్రశంసిస్తూ ఆయనకు ఒక సందేశం పంపారు. గ్రామాల్లోని వ్యవస్థలు, సదుపాయాలతో గ్రామీణులంతా గౌరప్రదమైన జీవితం గడిపేలా ఉండాలంటే ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించాలని మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్య సూత్రాన్ని ప్రతిపాదించారని మన్మోహన్సింగ్ అన్నారు.
సాంఘిక, ఆర్థిక రంగాల్లో సామాన్యులు స్వయం సమృద్ధితో జీవితంలో ఎదగడానికి ఆయన పలు నిర్మాణాత్మక చర్యలు చేపట్టారన్నారు. కుటీర పరిశ్రమల ద్వారా స్వదేశీ ఉత్పత్తులను ప్రొత్సహించడం, సమగ్ర గ్రామీణాభివృద్ధికి బాపుజీ ప్రతిపాదించిన కార్యక్రమాలను ఈ సందర్భంగా మన్మోహన్సింగ్ గుర్తు చేశారు. దేశంలోను, అంతర్జాతీయంగా కూడా శాంతి, మానవత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం లాంటి విలువలను మహాత్మాగాంధీ ప్రతిపాదించారని, వాటికి అంతర్జాతీయంగా కూడా ఔచిత్యం ఉందన్నారు. గాంధీజీ ఎప్పుడూ స్వీయ క్రమశిక్షణ గురించి చెప్పేవారన్నారు. ఇది మనుషులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాల్లో ఒకటన్నారని మాజీ ప్రధాని తెలిపారు. జీవితం ప్రశాంతంగా, విజయవంతంగా సాగాలంటే స్వీయ క్రమశిక్షణ చాలా ముఖ్యమని అన్నారు. ఈ సందర్భంగా జీకాట్కు తన శుభాభినందనలను తెలిపారు.
మాజీ ప్రధాని, ఆర్ధిక సంస్కరణల మహాత్ముడు అయిన డాక్టర్ మన్మోహన్సింగ్ నుంచి అభినందనలు, శుభాకాంక్షలు అందడం
ఎంతగానో సంతోషదాయకమని జీకాట్ బృందం ఈ సందర్భంగా తెలిపింది. స్వయంగా మాజీ ప్రధాని నుంచి లేఖ వచ్చిన విషయాన్ని జీకాట్ ప్రధాన సలహాదారు శ్యాంమోహన్, చైర్మన్ శ్యాంప్రసాద్రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ డాక్టర్ బి. ప్రతాప్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి. రామిరెడ్డి, వ్వవస్థాపకుడు ఢిల్లీ వసంత్, సిఇఒ శ్రవణ్మడప్, సిఒఒ కామేశ్వర్రాజు, సలహాదారు డాక్టర్ పాశం ప్రసాద్లు తెలియజేశారు.