Monday, April 29, 2024

మరాఠా కోటా ఉద్యమనేత మనోజ్ జారంగే నిరాహార దీక్ష విరమణ

- Advertisement -
- Advertisement -

ముంబై : మరాఠా కోటా ఉద్యమనేత మనోజ్ జారంగే గత 17 రోజులుగా మరాఠా కోటాపై సాగిస్తున్న నిరవధిక నిరాహార దీక్షను సోమవారం విరమించారు.అయితే కుంబీ కుల ధ్రువ పత్రాలను మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠా తెగలందరికీ పంపిణీ చేయడం ప్రారంభించే వరకు ఈ ఉద్యమాన్ని తాను కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆయా కుటుంబ సభ్యులందరికీ ఇలాంటి డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ ఈ ధ్రుప పత్రాలు అందించాల్సి ఉందని, దీనివల్ల రిజర్వేషన్ ఫలితాలు అందరికీ అందుతాయని చెప్పారు. ఉద్యోగాల్లోను, చదువుల్లోను మరాఠా కోటా కల్పించాలన్న డిమాండ్ల సాధనకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాడానికి ముంబై మార్చ్ చేపడతామని ప్రకటించడం, ముంబైలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం ఈ రెండూ ఒకేసారి కావడంతో మనోజ్ జారంగే తన దీక్షను విరమించడానికి నిర్ణయం తీసుకున్నారు. గత వారం మహారాష్ట్ర అసెంబ్లీ ఉభయసభలు మరాఠా కమ్యూనిటీకి చదువుల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేకంగా 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించాయి.

అయితే ఒబిసి కేటగిరిలో ఉన్న మరాఠా కమ్యూనిటీకి కూడా ఉద్యోగాల్లో, చదువుల్లో 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 10 నుంచి జల్నా జిల్లా అంతర్వాలి సారధి గ్రామంలో జారంగే నిరాహార దీక్ష చేపట్టారు. “ ఈ రోజు తాను నిరవధిక నిరాహార దీక్ష విరమించినప్పటికీ తనకు బదులుగా ముగ్గురు లేదా నలుగురు నిరాహార దీక్ష కొనసాగిస్తారని జారంగే తెలిపారు. తాను కూడా కొన్ని గ్రామాలకు వెళ్లి తన వైఖరిని ప్రజలకు వివరిస్తానని చెప్పారు. హోం శాఖ ఆంక్షలు విధించినందున అంతర్వాలి సారది గ్రామానికి వచ్చి తనను చాలా మంది కలుసుకోలేక పోతున్నారని తెలిపారు. కోటా ఉద్యమంపై అనేక ఫిర్యాదులు పోలీస్‌లకు వెళ్లాయనగా, తనను విచారించడానికి తనవద్ద ఎలాంటి సమస్యలు లేవని, కానీ వారు ఏదోవిధంగా ఇబ్బందులు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారని జారంగే చెప్పారు. ప్రజలు ఆగ్రహిస్తే సిఎం, హోం మంత్రి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. డిప్యూటీ సిఎం ఫడ్నవీస్ బ్రాహ్మణ కులస్థుడని జారాంగే ఆదివారం కొన్ని ఆరోపణలు చేయడంపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే జారంగేను తీవ్రంగా హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News