శ్రావస్తి (యుపి): బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదించారన్న నేరారోపణపై తొలగించిన పదిమంది ఉపాధ్యాయుల నుంచి రూ. 2.32 కోట్ల వసూలుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. శ్రావస్తి, బహ్రయిచ్ జిల్లాలకు చెందిన ఈ ఉపాధ్యాయులకు వేతనాలు, అలవెన్సుల కింద ఖర్చు చేసిన మొత్తాలను తిరిగి రాబట్టుకోడానికి రంగం లోకి దిగినట్టు అధికారులు బుధవారం తెలిపారు. మొత్తం పదిమందిలో ఆరుగురు శ్రావస్తి జిల్లా నుంచి తొలగించ బడ్డారు. నలుగురు బహ్రయిచ్ జిల్లా నుంచి తొలగించ బడ్డారు. ఆరుగురు నుంచి రూ.1.37 కోట్లు, నలుగురు నుంచి రూ.95 లక్షలు వసూలుకు రాష్ట్ర ప్రాథమిక విద్యావిభాగం నోటీసులు జారీ చేసింది. గత ఏడాది ఈ పదిమంది భోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదించారని బయటపడడంతో వీరిపై కేసులు నమోదయ్యాయి. జూన్ 20 నాటికి వీరు తమకు చెల్లించవలసిన సొమ్మును డిపాజిట్ చేయకుంటే చట్టపరమైన చర్యల ద్వారా వసూలు చేయడమౌతుందని ప్రాథమిక శిక్షా అధికారి ఓంకార్ రాణా హెచ్చరించారు.