గణేష్ నిమ్జజనంకు వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు
ఎంఎంటిసీ, ఆర్టీసీలు కూడా సేవలు పొడిగింపు
హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జనం పురస్కరించుకుని మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ భక్తులు ట్యాంక్బండ్ పరిసరాలకు చేరుకునేందుకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఆయా శాఖల ఉన్నతాధికారులు ప్రకటించారు. భక్తులకు సౌకర్యాలను వినియోగించుకోవాలని, ఇబ్బందులు వస్తే అధికారులు సమాచారం ఇవ్వాలని కోరారు. మెట్రో రెండు రోజుల పాటు అర్దరాత్రివరకు రైళ్లు నడపనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ నాగోల్ నుంచి హైటెక్ సిటీ, ఎల్బీనగర్ నుంచి మియాపూర్, పరేడ్గ్రౌండ్ నుంచి ఎంజీబిఎస్ కారిడార్లలో సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు.
ఈనెల 20వ తేదీ అర్దరాత్రి వరకు మూడు కారిడార్లలోని అన్ని చివర స్టేషన్ల నుంచి మెట్రో రైళ్లు బయలుదేరి, అర్దరాత్రి 2 గంటలకు చివరి స్టేషన్ చేరుకుంటుందని చెప్పారు. అదే విధంగా జంట నగరాల పరిధిలో ఎంఎంటిఎస్ ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 20వ తేదీ తెల్లవారుజాము 4 గంటల వరకు ప్రత్యేక సర్వీసులు కొనసాగుతాయన్నారు. వీటితో పాటు ఆర్టీసీ జోన్ పరిధిలోని 656 ప్రత్యేక సర్వీసులు నడిపిస్తుంది. 31 డిపోల నుంచి భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడిపిస్తున్నట్లు జోనల్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.