Monday, April 29, 2024

నాది అభివృద్ధి, సంక్షేమ బలం

- Advertisement -
- Advertisement -

మాక్లూర్: నాది అభివృద్ధి, సంక్షేమ బలం, కాంగ్రెస్, బిజెపిలది క్షుద్ర రాజకీయాలని పియుసి ఛైర్మన్, ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. నమస్తే నవనాథపురం కార్యక్రమంలో భాగంగా ఆదివారం మాక్లూర్ మండలం చిన్నాపూర్ గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రభుత్వశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఉదయం గ్రామంలోకి అడుగుపెట్టిన జీవన్‌రెడ్డికి ప్రజలు డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువలతో గ్రామస్తులు, పలు కులసంఘాలు, ప్రజా సంఘాల పెద్దలు జీవన్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. జై జీవనన్న, జైజై కెసిఆర్, జై తెలంగాణా, ఆర్మూర్ గడ్డ జీవనన్న అడ్డా అంటూ నినాదాలతో చిన్నాపూర్ గ్రామం హోరెత్తించారు. ఆయన ప్రతి ఒక్కరిని పేరుపేరునా పలకరిస్తూ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను ఆయన అక్కడికక్కడే పరిష్కరించారు.

అనంతరం జరిగిన సభలలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలలో గ్రామాల్లో సంతోషం వెల్లివిరుస్తోందన్నారు. చిన్నాపూర్ గ్రామమమంటే తనకెంతో ఇష్టమన్నారు. పేరుకే చిన్నాపూర్ అభివృద్ధిలో పెద్దాపూర్. ఈ గ్రామ పంచాయతీకి రూ.24.50లక్షల చొప్పున అభివృద్ధి నిధులు వస్తున్నాయన్నారు. గ్రామంలోని 413 మందికి రూ.2016 చొప్పున ప్రతి నెలా 8.52 లక్షల పెన్షన్లు వస్తున్నాయని చెప్పారు. వికలాంగుల పెన్షన్లు 3016 నుంచి 4016కు పెంచడం జరిగిందన్నారు. అలాగే కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ కింద 83 మంది పేదింటి ఆడపిల్లల పెండ్లిల్లకు మేనమామ కట్నంగా రూ.80.37లక్షలు అందజేయడంజరిగిందన్నారు. ఈ గ్రామంలో రైతుబంధు ద్వారా ఏడాదికి రూ 10వేల చొప్పున ఇప్పటికే రూ. 1.92 కోట్లను 328 మంది రైతుల బ్యాంకు ఖాతాలో జమయ్యాయని తెలిపారు. అలాగే అనేక సంక్షేమ పథకాల కింద అనేక మంది లబ్ధిపొందుతున్నారని తెలిపారు.

యాదవ సోదరులకు 70 గొర్రెల యూనిట్లకుగాను 20 యూనిట్లకు రూ. 25లక్షలు వచ్చాయని, మిగిలిన 50 యూనిట్లను ఈ నెలలో ఇవ్వబోతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే గృహ లక్ష్మీద్వారా ఇండ్లు నిర్మించుకోవడానికి రూ.3లక్షల చొప్పున మంజూరు చేయడంజరుగుతుందని, బిసి వర్గానికి చెందిన 15 కులాల వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక చేయూతనందిస్తున్నామని తెలిపారు. సిసి రోడ్ల నిర్మాణానికి గాను రూ.65.50లక్షలు, నేషనల్ హైవే 63 నుంచి చిన్నాపూర్ కల్లెడి వరకు రోడ్డు నిర్మాణానికి రూ.1.79 కోట్లు, 2.5 కిలోమీటర్ల అంతర్గత రోడ్ల నిర్మాణానికి గాను రూ.65లక్షలు, హైమాస్ లైట్లకు గాను రూ.1.25లక్షలు, గ్రామ పంచాయతీ భవనానికి రూ 16లక్షలు, రైతు వేదికకు రూ.22లక్షలు, ట్రాక్టర్ , ట్రాలీ, ట్యాంకర్ ఏర్పాటుకు రూ.7.50లక్షలు, డంపింగ్ యార్డు నిర్మాణానికి రూ 2.61లక్షలు, వైకుంఠధామానికి 12.50లక్షలు, ఎవెన్యూ ప్లాంటేషన్‌కు 5.5లక్షలు, 4 మరుగుదొడ్ల నిర్మాణానికి 5.52 లక్షలు, కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు, థర్డ్‌వైర్ బిగింపునకు గాను రూ.9.20 లక్షలు మంజూరు చేసినట్లు జీవన్‌రెడ్డి వెల్లడించారు.

మిషన్ కాకతీయ ద్వారా ఈ గ్రామంలో రూ. 68.19లక్షలు ఖర్చుచేసి 3 చెరువులు పునుద్ధరించామని తెలిపారు. గ్రామంలో మహిళా సంఘాలకు వడ్డీలేని రణాలను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశామన్నారు. కాగా చిన్నాపూర్‌గ్రామంలో పెద్ద ఎత్తున కుల సంఘ భవనాల నిర్మాణం చేపట్టామన్నారు. కుల సంఘాల భవనాల కోసం మన్నూరు కాపు సంఘానికి రూ.5లక్షలు, ముదిరాజ్ సంఘానికి రూ.5లక్షలు, వడ్డెర సంఘానికి 5లక్షలు, ఈద్గా కాంపౌండ్‌కు 5లక్షలు, గ్రామ పంచాయతీ బ్యాలెన్సింగ్ పనుల కోసం 10లక్షలు ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశామని తెలిపారు.

ఆర్మూర్ నియోజకవర్గంలో ఓట్లడిగే హక్కు బిఆర్‌ఎస్‌కు తప్ప మరే పార్టీకి లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాస్త ప్రభాకర్, వైస్ ఎంపిపి సుక్కి సుధాకర్, పిఎసిఎస్ ఛైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రజనీష్, భూషణ్, వినోద్, రవి, లతీఫ్, గ్రామ సర్పంచ్ లక్ష్మీ గంగారెడ్డి, ఉప సర్పంచ్ హైమద్, ఎంపిటిసి సత్యనారాయణ, బిఆర్‌ఎస్ పార్టీ మండల నాయకులు, విడిసి సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News