హైదరాబాద్: కరోనా వైరస్ విషయంలో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గాంధీ ఆస్పత్రిలో నిన్న కరోనా వైరస్ కేసు నమోదైన నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. కరోనాపై వదంతులను నమొద్దని, ఈ వైరస్ విషయంలో ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా వైరస్ పై కేంద్రప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామన్నారు. గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేదని, కరోనా బాధిత వ్యక్తి తుంపర్లతోనే వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పారు. ప్రజలు కొన్ని ముందు జాగ్రత్తలు, శుభ్రత పాటిస్తే సరిపోతుందని.. బహిరంగ ప్రదేశాల్లో తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే చోటే కరోనా జీవించే అవకాశం ఉందని, మన దగ్గర ఉష్ణోగ్రతలు ఎక్కువ కనుక వైరస్ వ్యాపించే అవకాశం తక్కువేనన్నారు. కరోనా వైరస్ నివారణ చర్యలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తామని.. ముందు జాగ్రత్తలపై హోర్డింగులు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తామని తెలిపారు. మిలిటరీ, చెస్ట్, ఫీవర్, వికారాబాద్ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల ఏర్పాటకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
Minister Etela Rajender Press Meet on Coronavirus