సిద్దిపేట: దుబ్బాక నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరు పెంచింది. మంత్రి తన్నీరు హరీశ్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొని బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు దడపుట్టిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో టిఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి హరీశ్ ధీమా వ్యక్తం చేశారు. దౌల్తాబాద్ మండల పరిధిలోని గోవిందాపూర్, పోసాన్పల్లిలో మంత్రి హరీశ్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”ఐదేళ్ల టిఆర్ఎస్ పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పేదింటి ఆడపిల్ల పెళ్లికి రూ. లక్షా పదహారు వేలు ఇస్తున్నాం. 24గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. బిడి కార్మికులకుక పింఛన్లు ఇస్తున్నాం.. బిజెపి వాళ్లు ఇస్తారా…? కాంగ్రెస్, బిజెపి నాయకులు ఓట్లు సమయంలోనే వస్తారు. టిఆర్ఎస్ సర్కార్ పాలనలో ఇంటింటికీ త్రాగునీరు అందించాం.
పేదింటి ఆడపిల్లల పెండ్లికి లక్ష నూట పదహారు రూపాయాలు ఇస్తున్నాం. కెసిఆర్ కిట్తో పాటు రూ. 12 వేల నగదు ఇస్తున్నాం. మీ కష్టసుఖాల్లో తోడు ఉండేది టిఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాలిపోయే మోటార్లు అంటే కాంగ్రెస్.. బాయికాడ మీటర్లు అంటే బిజెపి, ఉచిత కరెంట్ అంటే టిఆర్ఎస్ పార్టీ. ఈ ఎన్నికల్లో కాలిపోయే మోటార్లు, బాయికాడ మీటర్లు, ఉచిత కరెంట్ మధ్య పోటీ జరుగుతుంది. ప్రచారానికి పెద్ద ఎత్తున వచ్చిన అక్కచెల్లెళ్ల అభిమానం చూస్తే ఆనందంగా ఉంది. 70 ఏళ్ల కాంగ్రెస్, బిజెపి పాలనలో లేని అభివృద్ధి కేవలం ఐదేళ్ల టిఆర్ఎస్ పాలనలో చేసి చూపించాం. కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో బిడి కార్మికులకు పింఛన్లు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తే ఇప్పటివరకు బదులు లేదు. కేవలం ఓట్లపుడే కనిపించే కాంగ్రెస్, బిజెపిలను నమ్మొద్దు” అని మంత్రి హరీశ్ రావు సూచించారు.