Friday, April 26, 2024

టిఆర్‌ఎస్ అభ్యర్థులకు విశేష ఆదరణ

- Advertisement -
- Advertisement -

Minister KTR hold teleconference with TRS party leaders

 

గెలుపు కోసం గట్టిగా కృషి చేయాలి
ఉద్యోగాల కల్పనపై బిజెపి దుప్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలి
పట్టభద్రుల ఆదరణను ఓటుగా మలచుకోవాలి : ఎంఎల్‌సి ఎన్నికలు జరుగుతున్న
నియోజకవర్గాల నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి కెటిఆర్

హైదరాబాద్ : టిఆర్‌ఎస్ ఎంఎల్‌సిల అభ్యర్థుల పట్ల పట్టభద్రుల్లో మంచి స్పందన వస్తోందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఈ ఆదరణను ఎన్నికలు ముగిసే వరకు కొనసాగించాలని సూచించారు. ప్రతి ఓటును విలువైనదిగా భావించాలన్నారు. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వవద్దన్నారు. అలాగే ఉద్యోగాల కల్పనపై బిజెపి చేస్తున్న అసత్య ప్రచారాన్ని కూడా చాలా సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు. ఎంఎల్‌సి ఎన్నికలు జరుగుతున్న వరంగల్,- నల్గొండ,- ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు సంబంధించిన పార్టీ శ్రేణులతో శుక్రవారం కెటిఆర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పరంగా సాగుతున్న ప్రచారం, నాయకుల పనితీరును ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీల ప్రచారం ఏ విధంగా సాగుతున్నదన్న విషయంపై కూడా ఆయన ఆరా తీశారు. సిట్టింగ్ ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి విస్తృతంగా మూడు జిల్లాల్లో పర్యటిస్తూ విద్యావంతులను కలుస్తూ బరిలో ముందు వరుసలో కొనసాగుతున్నారన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని మూడు జిల్లాలకు సంబంధించిన పార్టీ శ్రేణులంతా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం గట్టిగా పని చేస్తున్నారని ఆయన కితాబిచ్చారు.

ఒక్క నల్గొండ జిల్లాకే 3 వైద్య కళాశాలలు వచ్చాయన్నారు. వరంగల్ నగరానికి పెట్టుబడులతో పాటు ఐటి పరిశ్రమ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఇప్పటికే ఖమ్మం నగరంలో ఐటి టవర్ ప్రారంభించుకున్నామన్నారు. ఈ మూడు జిల్లాల్లో యువకుల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం టాస్క్ ఏర్పాటు చేశామన్నారు. ఈ అంశాలపై పెద్దఎత్తున ప్రచారం చేయాలని సూచించారు. మరోవైపు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలో బరిలో ఉన్న వాణిదేవి అభ్యర్థిత్వానికి ప్రత్యర్థుల నుంచి సైతం సానుకూల స్పందన వస్తుందన్నారు.

సిఎం కెసిఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం గత ఏడు సంవత్సరాలలో అద్భుతమైన ప్రగతిని సాధించిందన్నారు. హైదరాబాద్ నగరానికి వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని కెటిఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో జరిగిన నగర అభివృద్ధిని నగర విద్యావంతుల దృష్టికి తీసుకుపోవాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. ప్రతి ఒక్క ఓటర్ ని నేరుగా కలిసి టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలన్నారు.

ఉద్యోగాల కల్పన విషయంలో బిజెపి పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నదని కెటిఆర్ అన్నారు. దీనిని గట్టిగా తప్పికొట్టాలన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పటి వరకు 1,33,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు.. మరో 50 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయబోతున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మన ప్రభుత్వానికి పార్టీకి ఉన్న సంబంధం పేగు బంధం లాంటిదన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు అనేక మినహాయింపులు ఇచ్చి ప్రమోషన్లు ఇచ్చామన్నారు. పార్టీ ఇన్‌ఛార్జీలు రానున్న వారం రోజుల పాటు అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో విద్యావంతుల నుంచి వస్తున్న స్పందనను పలువురుతో ఆయన స్వయంగా మాట్లాడారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో కెటిఆర్‌తో పాటు హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News