కరీంనగర్: బండి సంజయ్ ఎంపిగా గెలిచి రెండేళ్లు అయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె బుధవారం మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… బండి సంజయ్ ఎంపిగా గెలిచి ఇప్పటివరకు కరీంనగర్ కు ఏం సాధించారని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలు గురించి కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటిఐఆర్ కి నిధులు ఎప్పుడు కేటాయిస్తారో అడగండని సూచించారు. రాష్ట్రాల మధ్య సమాఖ్య స్ఫూర్తిని బిజెపి ప్రభుత్వం దెబ్బతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ప్రజా విధానాలకు వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వం ఏకపక్షంగా చట్టాలను తీసుకురావడం హేయమైన చర్య అన్నారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి వల్లే ఢిల్లీ అష్టదిగ్బంధనంలో కూరుపోయిందని మండిపడ్డారు. కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని ఫైర్ అయ్యారు. వ్యవసాయ చట్టం, విద్యుత్ చట్టం, జీఎస్టీ బకాయిలు విషయాల్లో కేంద్రం వైఖరి సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని కవిత స్పష్టం చేశారు.
MLC kalvakuntla kavitha Chit Chat with Media