ప్రధాని, రక్షణ మంత్రిని కోరిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: లడఖ్లో సరిహద్దు వివాదంపై చైనాతో జరుపుతున్న చర్చల వివరాలను ప్రజలకు తెలియచేయవలసిందిగా ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. చైనాతో వరుసగా జరుపుతున్న చర్చల ఫలితాలను ప్రజలు తెలుసుకోగోరుతున్నారని కాంగ్రెస్ పేర్కొంది. తూర్పు లడఖ్లో సరిహద్దుల వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడానికి మాస్కోలో రాజ్నాథ్ సింగ్, చైనా విదేశాంగ మంత్రి జనరల్ వీ ఫెంఘే శుక్రవారం చర్చలు జరిపిన నేపథ్యంలో కాంగ్రెస్ ఈ డిమాండ్ చేసింది. ఒక ముఖ్యమైన సమస్యపై దేశ ప్రజలకు సమాచారం ఇవ్వవలసిన రాజధర్మం ప్రధానికి, రక్షణ మంత్రికి ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా శనివారం అన్నారు. విదేశాంగ మంత్రుల స్థాయి నుంచి సైనిక స్థాయి వరకు, తాజాగా రక్షణ మంత్రుల మధ్య జరిగిన చర్చల జాబితాను ఆయన ప్రస్తావిస్తూ ఈ మొత్తం చర్చల ఫలితాలు ఏమిటో చెప్పాలని ఆయన కోరారు.