హాజరైన కేంద్రమంత్రి, ఇద్దరు సిఎంలు, గవర్నర్
తవాంగ్: చిరస్మరణీయ దౌత్యవేత్త, దేశం గర్వించదగ్గ యోధుడు, మేజర్ రాలెంగ్నావో బాబ్ ఖాతింగ్ స్మారకానికి అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ పట్టణంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం స్థానిక కళావాంగ్పో ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, కేంద్రమంత్రి కిరెన్రిజీజ్, అరుణాచల్ప్రదేశ్ గవర్నర్ రిటైర్ట్ బ్రిగేడియర్ బిడి మిశ్రా, ముఖ్యమంత్రి పెమాఖండూ, మేఘాలయ ముఖ్యమంత్రి కోన్రాడ్సంగ్మా హాజరయ్యారు. టిబెట్ సరిహద్దులోని కీలక ప్రాంతం తవాంగ్ను భారత్లో కలపడంలో బాబ్ ఖాతింగ్ కీలక భూమిక పోషించారు.
స్వాతంత్య్రానికి పూర్వం అరుణాచల్ప్రదేశ్ను నార్త్ ఈస్ట్ ఫ్రాంటైర్ ఏజెన్సీ(ఎన్ఇఎఫ్ఎ)గా పిలిచేవారు.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తవాంగ్ ప్రాంతం టిబెట్ ఆధీనంలో ఉండేది. దానిని భారత్లో విలీనం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం చొరవ చూపలేదు. స్వాతంత్య్రానంతరం అప్పటి అస్సాం గవర్నర్ జైరామ్దాస్ దౌలత్రామ్ మార్గదర్శకత్వంలో ఆ ప్రాంతానికి భారత సైన్యంతో వెళ్లి స్వాధీనం చేసుకోవడంలో బాబ్ఖాతింగ్ కీలక పాత్ర పోషించారు. 1951 జనవరి 17న ఈ సంఘటన జరిగింది. సైనిక చర్యకు ముందు ఆ ప్రాంతంలోని మోన్పా సామాజిక వర్గంతో ఖాతింగ్ చర్చలు జరిపారు. టిబెట్ ప్రభుత్వం మాదిరిగా భారత ప్రభుత్వం అక్కడి స్థానికులపై అధిక పన్నులు వసూలు చేయబోదని హామీ ఇచ్చారు.