హైదరాబాద్: ధాన్య సేకరణ కోసం కావాల్సినన్ని గోనె సంచులు అందుబాటులో ఉంచేందుకు ఆయా జిల్లాలలోని పాత గోనె సంచులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. వివిధ కారణాలతో పంట విస్తీర్ణాన్ని సమగ్ర రైతు సమాచార పోర్టల్ లో నమోదు చేయకపోతే, అటువంటి రైతుల పొలాలను వ్యవసాయ విస్తరణ అధికారి సందర్శించి నమోదు చేయించుకుని టోకెన్లను రైతులకు ఇవ్వాలన్నారు. ఒకవేళ రైతు నివాసము ఒక రెవెన్యూ గ్రామమైనా, పక్క రెవెన్యూ గ్రామంలో భూమి ఉన్నచో అట్టి రైతుకు అనువైన నివాస గ్రామంలో కానీ, భూమి ఉన్న గ్రామంలో ధాన్యం విక్రయించేందుకు ఎఇఒలు టోకెన్లు జారీ చేయాలి.
ఒకవేళ ధాన్య సేకరణ కేంద్రంలో సరిపడా తాడిపత్రిలు అందుబాటులో లేనిచో ఆయా కేంద్రాలు కావలసిన తాడిపత్రిలను రైతుల నుండి అద్దెకు తీసుకోవాలని సూచించారు. వరి, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను రైతుల కోసం మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు పల్లా శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 4 వేల కొనుగోలు కేంద్రాలలో 4.78 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేయగా, 883 కొనుగోలు కేంద్రాల ద్వారా 10.64 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేశారు.