Sunday, April 28, 2024

“కొత్త పార్లమెంట్ మోడీ మల్టీప్లెక్స్‌” … జైరాం రమేశ్ విమర్శలకు బీజేపీ కౌంటర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నూతన పార్లమెంట్ మోడీ మల్టీప్లెక్స్ అని కాంగ్రెస్ విమర్శించింది. నూతన భవనంలో చర్చలు కనుమరుగయ్యాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విటర్ వేదికగా ఆరోపించారు. కొత్త పార్లమెంట్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన సమావేశాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. “ నూతన పార్లమెంట్ మోడీ మల్టీప్లెక్స్ లేదా మారియట్. కొత్త భవనంలో నాలుగు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో చాలా విషయాలను గమనించా. ఈ భవనం ప్రధాని మోడీ లక్షాలను చాలా బాగా అర్థం చేసుకోగలిగింది.

చట్టసభల్లో చర్చలు కనుమరుగైనట్టుగా అనిపిస్తోంది. పార్లమెంట్ ఆవరణలో కూడా ఇదే కొనసాగుతోంది. రాజ్యాంగంలో ఎలాంటి సవరణలు చేయకుండానే ప్రధాని విజయం సాధించారు. ” అని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన పాత పార్లమెంట్‌ను గుర్తు చేసుకున్నారు. పాత పార్లమెంట్‌లో ప్రతిసభ్యుడితో చర్చలు జరిపే అవకాశం ఉండేదని అన్నారు. ప్రస్తుతం సభ్యులను చూసేందుకు బైనాక్యులర్ అవసరం ఉంటుందేమో అంటూ కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇవి సమావేశాలను చర్చలను బలహీన పరుస్తాయని ఆరోపించారు. గతంలో సెంట్రల్‌హాల్, కారిడార్లలో నడిచేందుకు వీలుండేదని, ఇక్కడ చాలా ఇరుకుగా ఉన్నట్టు అనిపిస్తోందని అన్నారు. మళ్లీ పాత పార్లమెంట్ వెళ్లేందుకు ఎదురుచూస్తుంటాను అని జైంరామ్ రమేశ్ అన్నారు.

ఇది భారతీయులను అవమానించడమే : బీజేపీ

జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. “ కాంగ్రెస్ పాటించే అత్యల్ప ప్రమాణాల్లో ఇదీ ఒకటి. ఈ చర్య ద్వారా కాంగ్రెస్ 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అవమానిస్తోంది. పార్లమెంట్‌కు వ్యతిరేకంగా మాట్లాడడం ఆ పార్టీకి ఇది మొదటిసారి కాదు. గతం లోనూ ఈ విధంగా మాట్లాడి విమర్శల పాలైంది” అని కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News