Saturday, April 27, 2024

ప్రభుత్వరంగానికి మోడీ తాళం

- Advertisement -
- Advertisement -

మోడీ నాయకత్వాన ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం తన తొమ్మిది సంవత్సరాల పాలనలో చేసిన వాగ్ధానాల అమల్లో ఘోరంగా విఫలమైంది. ప్రజల మౌలిక సమస్యల పరిష్కార జోలికి పోకుండా దేశ, విదేశీ బడా పెట్టుబడిదారుల, బహుళ జాతిసంస్థల ప్రయోజనాలే ముఖ్యంగా పాలన సాగిస్తున్నది. దేశ సహజ సంపదలను వారి ఫరం చేస్తున్నది. దేశాన్ని అప్పుల మయంగా తయారు చేసి ప్రజలపై మోయలేని భారాన్ని మోపింది. పేదరికం, నిరుద్యోగం, ఉపాధి లేమితో ప్రజలు అల్లాడుతున్నారు. వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభం లోకి నెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతున్నది. అన్ని రంగాల్లోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నది. అనకొండలా పెరుగుతున్న అప్పులు: తాము అధికారంలోకి వస్తే విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని రప్పించి ప్రతి ఇంటికి 15లక్షల రూపాయలు అంద చేస్తామని బీజేపీ నాయకత్వాన ఉన్న ఎన్ డీ ఏ ప్రకటించింది.

డబ్బులు మాత్రం ఇవ్వలేదుగాని, ప్రజలపై తలసరి రుణభారం మాత్రం మోపింది. దేశంలో దేశీయ ,విదేశీ అప్పులు అనొండలా పెరుగుతున్నాయి. 2014 మార్చి 31 నాటికి ప్రభుత్వాలు చేసిన అప్పు 55.87 లక్షల కోట్లు. గడచిన 65 సంవత్సరాలను గమనిస్తే మోడీ ప్రభుత్వ 9సంవత్సరాల పాలనలో దాదాపు 100 లక్షల కోట్ల కొత్త అప్పులు భారత ప్రజలపై పడింది 2022 చివరి నాటికి భారతదేశ అప్పులు 152.17 లక్షల కోట్లకు చేరుకుంటాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రకటించింది. 2022 చివరినాటికి భారతదేశ చేసిన విదేశీ రుణాలు 4.94 లక్షల కోట్లగా ఉన్నాయని రిజర్వుబ్యాంక్ అధికారిక వెబ్ సైట్ తెలిపింది .పాలకులు చేసిన అప్పుల ఫలితంగా 2014 లో ఉన్న భారతదేశ తలసరి అప్పు 4.30లక్షల ఉంటే 2022 నాటికి 11లక్షలకు చేరుకుంటుంది.

ప్రభుత్వ ఆస్తుల ప్త్రెవేటీకరణ గత ప్రభుత్వాలు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలనైనా కొనసాగించాయి. ఎన్‌డీఏ నాయకత్వాన మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను, ఆస్తులను తెగబడి అమ్ముతున్నది. అనేక సంస్థలను ప్త్రెవేటీకరిస్తున్నది. ప్రభుత్వం వ్యాపారం చేయదంటూ అందుకు కుంటి సాకులు చెబుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థలంటే వ్యాపార సంస్థలు కాదని, ప్రజల ప్రయోజనాల కోసం ఏర్పడ్డవనే జ్ఞానం కూడా మోడీ ప్రభుత్వానికి లోపించినది.
సమాజ హితం కోసం ప్రధాన రంగాలన్నీ ప్రభుత్వ అజమాయిసీలో ఉంటేనే ప్రజల అభివృద్ధి సాధ్యమని సామాజిక ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సంపద సృష్టికి ప్రభుత్వ రంగం వేసే దారులు, కార్మిక వర్గం ధారపోసిన నెత్తురే కారణమన్న చారిత్రక సత్యాన్ని కావాలనే మోడీ ప్రభుత్వం వ్యతిరేకించటమే కాకుండా పెట్టుబడిదారులే సంపద సృష్టి కర్తలని వారికి సాగిల పడుతున్నది.

1951 నాటికి కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు ఐదు మాత్రమే ఉన్నప్పటికీ క్రమంగా 1991 నాటికి 246కి పెరిగాయి. దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు 2017-18 ఆర్థిక సంవత్సరంలో 20,23732 ఆదాయాన్ని సమకూర్చి, 1,59,635 కోట్లు లాభాలు ఆర్జించాయి. పన్నుల రూపంలో ప్రభుత్వానికి 3,50,052 కోట్లు చెల్లించాయి. పాలక ప్రభుత్వాలు సక్రమమైన విధానాలు అమలు జరిపితే ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలు గడిస్తాయనే దానికి ఇదే నిదర్శనం.
మోడీ నాయకత్వాన ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వానికి బడా పెట్టుబడిదారులకు సేవ చేయటం తప్ప ప్రజల సంక్షేమం గురించిన ఆలోచనే లేదు. ప్రభుత్వ రంగ మంటేనే దానికి గిట్టదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రభుత్వ రంగ సంస్థలను, ఆస్తులను బడా పెట్టుబడిదారుల పరం చేసే విధానాలు అమలు జరుపుతున్నది.

2016లో నీతిఅయోగ్ ద్వారా 74ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణను ప్రతిపాదించింది. దాని ప్రతిపాదనలకు అనుగుణంగా ఆయా సంస్థల్లో 100%పెట్టుబడులు అమ్మేందుకు 2017లో మోడీ ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వ రంగ సంస్థలను పునర్ వ్యవస్థీకరించటం, నష్టాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను వదిలించుకోవటానికి మొదట పెట్టుబడుల ఉపసంహరణ, ప్త్రెవేటీకరణలను ఒక విధానంగా మోడీ ప్రభుత్వం అమలు జరిపింది. లాభాల్లో ఉన్న సంస్థలను కూడా అమ్మకాలకు పెడుతున్నది. అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 100% పెట్టుబడుల ఉపసంహరణ దిశగా మోడీ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తున్నది. బిపిసిఎల్, ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్, ఐడిబిఐ బ్యాక్, బిఇఎంఎల్ తదితర సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు రంగం సిద్ధమైంది.ఎల్ ఐ సిలో కూడా ప్త్రెవేట్ పెట్టుబడుల కు అనుమతించింది. లాభాల్లో ఉన్న సింగరేణి బొగ్గు గనులను, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్త్రెవేటీకరణ చేస్తున్నట్లు ప్రకటించింది .

మోడీ ప్రభుత్వం ఏ రంగానికీ ప్త్రెవేటీకరణ నుండి మినహాయింపుల ఇవ్వలేదు. 150 జతల ప్రయాణీకుల రైళ్లను ప్త్రెవేట్ భాగస్వామ్యంతో నడిపేనదుకు, ప్తైవేట్ సంస్థల నుంచి రైల్యేశాఖ బిడ్స్ ను ఆహ్వానించింది. దీని ద్వారా 30వేల కోట్లను రైల్యేశాఖ పొందుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ప్తైవేట్ భాగస్వామ్యంతో అనేక రైళ్లు నడుస్తున్నాయి. ఎరువుల పరిశ్రమలు: వ్యవసాయ రంగంలో ఎరువుల పాత్ర కీలకమైంది. ఎరువుల ఉత్పత్తిలో స్వయం సంమృద్ధి సాధింటంలో నేటికీ పాలక ప్రభుత్వాలు విఫమౌతూనే ఉన్నాయి. సగానికిపైగా ఎరువులు విదేశాల నుండి దిగుమతి అవుతున్నాయి. ఎరువుల పరిశ్రమలకే ధరల నిర్ణయం అప్పగించటం వలన వాటి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశీయ పరిశ్రమలు విస్తరించే విధానాలు అమలు జరపకపోగా ఉన్న వాటిని కూడా ప్త్రెవేటీకరణకు పూనుకుంది. ప్త్రెవేటికరించే ఎరువుల సంస్థల్లో రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ (ఆర్ సీ ఎఫ్), నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, బ్రహ్మపుత్ర వ్యాలీ ఫర్టిలైజర్స్, కార్పొరేషన్ లిమిటెడ్,

ఎల్‌సీఐ అమరావతి జిప్పం అండ్ మినరల్స్, మద్రాస్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావన్ కోర్ (ఎఫ్ ఏసీటీ), హిందూస్థాన్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లు ఉన్నాయి.
ప్రధాన మంత్రులుగా అనేక మంది పని చేశారు. ఎవరి పాలనలో ఎన్ని సంస్థలు మూసివేయబడ్డాయన్నది గమనిస్తే, వాజ్ పాయ్ పాలనలో 7పరిశ్రమలు, మన్మోహన్ సింగ్ పాలనలో మూడు, మోడీ పాలనలో 23 సంస్థలు మూసి వేయబడ్డాయి. 1991-92 నుండి 2018-19 వరకు 3,47,493కోట్లు పరిశ్రమల వాటాల అమ్మకం ద్వారా ప్రభుత్వాలు సాధించాయి. 27 ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా మూసివేయబడ్డాయి. 2003లో అల్యూమినియం కంపెనీలో వాజ్ పాయ్ ప్రభుత్వం 5వేల కోట్ల విలువైన 51% వాటాలను కేవలం 551 కోట్లకు అమ్మి వేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో 20వేల కోట్ల విలువైన 10% వాటాలను 4,889 కోట్ల రూపాయలగా చూపెట్టి మోడీ ప్రభుత్వం అమ్మకాలకు పెట్టింది. పరిశ్రమల అమ్మకం ద్వారా లక్షల కోట్ల రూపాయల ఆర్జనే ద్యేయంగా మోడీ ప్రభుత్వం పెట్టుకుంది.

అసలు ప్రభుత్వ రంగ పరిశ్రమలే ఉండగూడదన్నది మోడీ ప్రభుత్వ విధానంగా ఉంది. ఉద్యోగాల మాట తప్పటం ఎన్‌డీఏ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మోడీ నోటి నుండి రాలేదు. ఎన్‌డీఏ వాగ్దానం ప్రకారం 9సంవత్సరాల్లో 18కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు రావాల్సి ఉంది. ఉద్యోగ కల్పనలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దేశంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తున్నది. నిరుద్యోగం 47 సంవత్సరాల నాటి గరిష్ఠానికి చేరుకుంది. 18-25 సంవత్సరాల మధ్య పట్టభద్రుల్లో నిరుద్యోగం 42% చేరింది. ఇటీవల అజీజ్ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశ గ్రామీణ జనాభా లో 2023 లెక్కల ప్రకారం 40% కూలీలుగానే ఉన్నారు.

రైతుల ఆదాయం రెట్టింపు కలగానే మిగిలింది పంటలకు గిట్టుబాటు ధర, దాని చట్టబద్దత ఊసేలేదు. రైతుల ఆత్మహత్యలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. రైతలకు రుణమాఫీ చేయటం సరైన విధానం కాదని చెప్పే మోడీ బ్యాంకులకు వేలకోట్లు ఎగనాం పెట్టిన కార్పొరేట్ గద్దలపై జాలిపడి 13లక్షల కోట్ల రుణాలు టైటాప్ చేసి వారి రుణం తీర్చుకున్నాడు. మోడీ పాలనలో పేదరికం, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రజల ఏ సమస్య పరిష్కారం కాలేదు. ప్రజలు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. దేశ సంపద కొద్ది మంది వద్ద పోగుపడుతున్నది. మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఉద్యమించటమే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News