Monday, April 29, 2024

ఇకపై టీహబ్‌లో ఉచితంగా వైద్య పరీక్షలు

- Advertisement -
- Advertisement -

జనగామటౌన్ : పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించే లక్షంగా ప్రభుత్వం టీహబ్‌ను ఏర్పాటు చేసిందని, ఇకపై టీహబ్‌లో ఉచితంగా టెస్టులు నిర్వహించనున్నట్లు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని ప్రధాన జిల్లా ఆస్పత్రి ఎదురుగా ఉన్న తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్‌లో అత్యాధునిక యంత్రాలతో టెస్టు అప్‌గ్రేషన్ కార్యక్రమం రాష్ట్ర వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వేలకు వేలు ఖర్చు చేసి చేయించుకునే టెస్టులను ఇకమీద తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్‌లో ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు.

ఇంతకు ముందు 17 రకాల టెస్టులు మాత్రమే చేసేవారని, కానీ ఇప్పుడు వాటి సంఖ్య 131కి పెరిగిందన్నారు. జపాన్, అమెరికా, జర్మనీ నుంచి తెప్పించిన అధునాత యంత్రాలతో ఈ టెస్టులు చేస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీహబ్ ద్వారా నిరుపేదలకు ఆరోగ్య భరోసా కల్పిస్తుందన్నారు. దేశంలోనే పేదలకు వైద్యం, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

సిటి స్కానింగ్ యంత్రం కోసం ఎమ్మెల్యే వినతి… జనగామ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో సిటి స్కానింగ్ యంత్రం ఏర్పాటు చేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మంత్రి హరీశ్‌రావును కోరారు. అదే విధంగా ల్యాబ్‌లో మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ జనగామ ప్రభుత్వ ఆస్పత్రిని ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. మహిళలు ముందస్తుగా వైద్య పరీక్షలు చేయించుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు అవగాహన కల్పించాలన్నారు.

అదేవిధంగా జనగామ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు, తరగతుల నిర్వహణపై పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పోకల జమున, డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రశాంత్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్‌రాజు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్‌రావు, నాయకులు మల్లిగారి రాజు, దేవరాయ నాగరాజు, గుర్రం నాగరాజు, ఉడుగుల నర్సింహులు, దేవునూరి సతీష్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News