Monday, April 29, 2024

అజారుద్దీన్‌పై నాన్‌బెయిల్ కేసు

- Advertisement -
- Advertisement -

హెచ్‌సిఎ అవినీతి వ్యవహారంలో ఉప్పల్ ఠాణాలో కేసులు నమోదు
క్రీడా సామగ్రి కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడ్డ మాజీ క్రికెటర్
నిర్ధారించిన విచారణ కమిటీ
హెచ్‌సిఎ సిఇఒ ఫిర్యాదుతో కేసు

మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ క్రికెట్ అజారుద్దీన్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఉప్పల్ స్టేడియంలో వివిధ సామాగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగిందని ఆరోపిస్తూ హెచ్‌సిఎ సిఇఒ సునీల్ చేసిన ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అగ్నిమాపక పరికరాలు, క్రికెట్ బంతులు, బకెట్ కుర్చీలు, జిమ్ సామాగ్రితో సహా అనేక పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయని సీఇఒ ఫిర్యాదులో పేర్కొన్నారు. అజారుద్దీన్‌పై ఐపిసి 406,409, 420, 465, 467, 471, 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2019-2022 మధ్య హెచ్‌సిఎ అధ్యక్షుడిగా అజర్ ఉన్న సమయంలో అక్రమాలను ప్రత్యేక విచారణ కమిటీ నిర్ధారించింది.

పరికరాల కొనుగోలు కమిటీలో ఉన్న అజారుద్దీన్, జాన్ మనోజ్, విజయానంద్ మీద కేసు నమోదైంది. నలుగురు హెచ్‌సిఎ మాజీల మీద కూడా ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో నెలకొన్న వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలో వన్ మ్యాన్ కమిటీ నియమిస్తూ ఈఏడాది ఫిబ్రవరి నెలలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో హెచ్‌సిఎ ప్రక్షాళనకు లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని ఏకసభ్య కమిటీ చర్యలు చేపట్టింది. ఆగస్టు నెలలో బహుళ క్లబ్‌లతో హెచ్‌సిఎను శాసిస్తున్న క్రికెట్ పెద్దలకు షాకిచ్చింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న 57 క్లబ్‌లపై జస్టిస్ నాగేశ్వరరావు అనర్హత వేటు వేశారు.

దీనికితోడు అక్టోబర్ నెలలో హెచ్‌సిఎ ఎన్నికల్లో పోటీ చేయకుండా మహ్మద్ అజహరుద్దీన్ పై కమిటీ అనర్హత వేటు వేసింది. గతంలో ఏకకాలంలో హెచ్‌సిఎ, డెక్కన్ బ్లూస్ క్లబ్ అధ్యక్షుడిగా అజహరుద్దీన్ వ్యవహరించారు. హెచ్‌సిఎ అధ్యక్షుడిగా ఉండి నిబంధనలు ఉల్లంఘించినందుకు అనర్హత వేటు వేస్తున్నట్లు కమిటీ తెలిపింది. ఈ మేరకు హెచ్‌సిఎ ఓటరు జాబితా నుంచి అజహరుద్దీన్ పేరును సైతం తొలగిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. తాజాగా అజహరుద్దీన్ పై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో సుప్రీంకోర్టు నియమించిన లావు నాగేశ్వరరావు కమిటీ ఫిర్యాదు చేసింది. నిధుల గోల్ మాల్, సామా గ్రి కొనుగోలులో అవకతవకలకు పాల్పడినట్లు ఆడిట్ రిపోర్ట్‌లో తేలడంతో అజహారుద్దీన్‌పై కమిటీ ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వచ్చే ఎన్నికల్లో జూబ్లిహిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున అజహరుద్దీన్ పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కావడం రాజకీయవర్గాల్లో సంచలనంగామారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News