స్పీకర్ బిర్లా ఆదేశాలు. కౌన్సిల్ ఘటనపై విచారం
న్యూఢిల్లీ : కర్నాటక శాసనమండలి ఉప సభాపతి మృతిపై దర్యాప్తునకు లోక్సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఆదేశించారు. సమగ్రమైన, ఉన్నత స్థాయి దర్యాప్తు స్వతంత్ర సంస్థతో చేపట్టాలని బుధవారం సూచించారు. కర్నాటక కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ 64 సంవత్సరాల ఎస్ఎల్ ధర్మే గౌడ చికమల్గూరు జిల్లాలో రైలు పట్టాలపై చనిపోయి ఉండగా కనుగొన్నారు. ఆయన జెడిఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ ఘటనపై లోక్సభ స్పీకర్ స్పందించారు. గౌడ సభాధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు శాసనమండలిలో జరిగిన పరిణామం అత్యంత దురదృష్టకరం. అప్పటి ఘటన ప్రజాస్వామ్యంపై దాడి అని వ్యాఖ్యానించారు. కౌన్సిల్లో సంఘటనకు ఆయన అనుమానాస్పద మృతికి ఏదైనా సంబంధం ఉందా? అనే వార్తలు వెలువడ్డాయి.
ఈ దశలోనే స్పీకర్ ఓం బిర్లా ఆయన మృతిపై ఉన్నత స్థాయి దర్యాప్తు అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లెజిస్లేటివ్ కౌన్సిల్లో డిసెంబర్ 15వ తేదీన గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సభాధ్యక్షులు ప్రతాప్ చంద్ర శెట్టిపై అవిశ్వాసానికి సంబంధించి వివాదం చెలరేగింది. ఈ దశలో బిజెపి, జెడిఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్సీల మధ్య దూషణలు, ఒకరినొకరు నెట్టుకోవడం,ఈ క్రమంలో అధ్యక్ష స్థానంలో ఉన్న గౌడను సీటునుంచి బయటకు లాగడం వంటి పరిణామాలు జరిగి సభ నిరవధిక వాయిదాకు దారితీశాయి. ఈ ఘటన తరువాత దాదాపు పక్షం రోజులకు ధర్మేగౌడ శవం పట్టాలపై కన్పించింది. ఇది రాజకీయంగా ఇతరత్రా కర్నాటకలోనే కాకుండా, దేశవ్యాప్తంగా సంచలనం కల్గించింది.