Sunday, April 28, 2024

మావి దేశమంతా మెచ్చుకుంటున్న పథకాలు

- Advertisement -
- Advertisement -

ఆర్మూర్ : ప్రభుత్వం నిర్వహించిన సంక్షేమ సంబురాలపై కాంగ్రెస్, బిజెపి నాయకులు విషం కక్కుతున్నారని ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంటే వారికి ఎందుకంత అక్కసు అని పియుసి ఛైర్మన్, ఆర్మూర్ ఎంఎల్‌ఏ, బిఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం లక్కంపల్లి గ్రామానికి చెందిన గూండ్ల సంఘం, మాదిగ సంఘం, వెల్మల్ గ్రామానికి చెందిన మైనారిటీ,ఆర్మూర్ పట్టణానికి చెందిన మేరు సంఘాల సభ్యులు వందల సంఖ్యలో బిఆర్‌ఎస్‌లో చేరారు. తామంతా బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు, ప్రధానంగా ముఖ్యమంత్రి కెసిఆర్ సమర్థవంత పాలనకు ఆకర్షితులై బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నామని తెలిపారు. ఆర్మూర్ ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి నాయకత్వానికి వారు మద్ధతు తెలిపారు. అంకాపూర్‌లో ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి నివాసంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన సమక్షంలో వారు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి జీవన్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.

పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు కల్పిస్తామని, రెట్టింపు గౌరవం ఉంటుందని వారికి భరోసానిచ్చారు. బిఆర్‌ఎస్ గూటికి చేరినవారంతా దేశ్‌కీ నేతా కెసిఆర్, జై జీవనన్న, ఆర్మూర్ గడ్డ జీవనన్న అడ్డా, జై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున చేసిన నినాదాలతో అంకాపూర్ మారుమోగింది. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మా ట్లాడుతూ కాంగ్రెస్, బిజెపి నేతలు కళ్లుండి చూడలేని కబోదులని ధ్వజమెత్తారు. మావి దేశమంతా మెచ్చుకుంటున్న పథకాలని, ప్రతి ఇంటికి ఒకటి నుంచి మూడు వరకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అందుకే అంబరాన్నంటేలా సంక్షేమ సంబురాలు నిర్వహించాం, ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధిని చూడండి, అ భివృద్ధికి అసలైన ఆనవాలుగా ఆర్మూర్‌ను నిలిపాం, రూ.3వేల కోట్లతో ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా, బిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ అయిందని, ఆలూర్, డొంకేశ్వర్‌లు కొత్తగా మండలాలుగా చేశామన్నారు. అంబేద్కర్ చౌరస్తాను సుందరీకరించాం, సిద్దులగుట్టకు రూ 20 కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మాణంజరిగిందన్నారు. ఆర్మూర్-_నిజామాబాద్, ఆర్మూ ర్‌_ఆలూర్, ఇలా దాదాపు 9 బైపాస్ రోడ్లు వచ్చాయన్నారు.

అలాగే రూ.450 కోట్లతో ఖర్చుచేసి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలతో మంచీనీళ్లు ఇస్తున్నాం, మిషన్ కాకతీయ ద్వారా రూ.58 కోట్లతో 220కి పైగా చెరువులు బాగు చేసినం, ఆ చెరువుల్లో చేపలు పెంచుతూ మత్స కారులకు మేలుచేశామన్నారు. ఎకరానికి 10వేల చొప్పున రైతుబంధు పెట్టుబడి ఇస్తున్నాం, 24 గంటల ఉచిత విద్యుత్, కల్యాణ లక్ష్మీ ద్వారా 8500మందికి, షాదీ ముబారక్‌ద్వారా 1600 మందికి పేదింటి ఆడబిడ్డలకు పెండ్లిళ్లు చేశామని తెలిపారు. ఆర్మూర్‌కు 100 పడకల ఆసుపత్రిని సాధించుకున్నాం, ఇక్కడ ఇప్పటికే 25వేలకు పైగా ఉచిత ప్రసవాలు జరిగాయని, ఒక్కో తల్లికి 50వేల రూపాయల చొప్పున వారికి భారం తగ్గిందన్నారు. 25వేల మందికి ఆనారోగ్య బాధితులకు సిఎంఆర్‌ఎఫ్‌లో ఎల్‌ఓసి చెక్కులు అందించామన్నారు. రూ.120 కోట్లు ఖర్చుచేసి పంచగూడ వంతెన కట్టించి రెండు జిల్లాల మధ్యదూరం తగ్గించడం జరిగిందన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా వివిధ సామాజిక వర్గాలవారికి 200క పైగా భవనాలకు నిధులిచ్చామని, వటిలో దాదాపు 10 మల్టీ పర్సస్ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి కోట్లాది నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.

హైదరాబాద్‌లోని కోకాపేట్, ఉప్పల్ భగాయత్ ప్రాంతాల్లో సకల కులాల ఆత్మగౌరవ భవనాల కోసం విలువైన భూములిచ్చాం, దేశంలో ఎక్కడాలేని విధంగా కొత్త సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టామని, 125 అడుగుల భారీ అంబేద్కర్‌విగ్రహం ప్రతిష్టించి ఆయన స్ఫూర్తిని భావితరాల వారు ఆచరించేలా చేశామన్నారు. అంబేద్కర్ మూల సిద్దాంతాలకనుగుణంగా కెసిర్ పాలన సాగుతోందన్నారు. 2600 డబుల్‌బెడ్ రూం ఇళ్లను మంజూరు చేశాం సొంత స్థలాలు ఉన్న మరో 3వేలమందికి ఇండ్లు కట్టుకోడానికి మూడు లక్షల చొప్పున అందించడం జరిగిందన్నారు. బిసీలకు లక్ష రూపాయల చొప్పున అందిస్తున్నామన్నారు. అలాగే సిఎం కెసిఆర్ పెన్షన్లను పెంచారని వికలాం గులకు 4016 వరకు పెంచారని అన్నారు. మంత్రి కెటిఆర్ ఇచ్చిన 5 కోట్లతో ఆర్మూర్ పట్టణాన్ని తీర్చిదిద్దామన్నారు.

నియోజకవర్గవ్యాప్తంగా తళతళ మెరిసే రోడ్లు వేశాం, డ్రైనేజీలు ఆధునీకరించాం, పల్లె ప్రగతి ద్వారా పల్లెలన్నీ ప్రకృతి వనాలు, నర్సరీలు, సిసి రోడ్లు, సకల సౌకర్యాలతో వైకుఠధామాలు, చెత్తను తొలగించే ట్రాక్టర్లు, పరిసరాల పరిశుభ్రత, మన ఊరు -మన బడి ద్వారా పాఠ శాలల అభివృద్ధి వంటి పనులతో కళకళలాడుతున్నాయంటూ జీవన్‌రెడ్డి పేర్కొం టూ ఘనంగా సంక్షేమ సంబురాలు జరుపుకున్నామని విమర్శిస్తున్న కాంగ్రెస్, బి జెపి నాయకులకు చెబుతున్నానన్నారు. ఆర్మూర్ ప్రజలంతా బిఆర్‌ఎస్‌వైపేనని, గులాబీ గూటికి చేరడానికి సకల వర్గాల ప్రజలు క్యూకడుతున్నారన్నారు. గత నా లుగు రోజులుగా 6వేల మందికి పైగా బిఆర్‌ఎస్‌లో చేరారని, గులాబీ కండువాలు కప్పి నా చేతులు నొప్పిపెడుతున్నాయన్నారు. ఎవరినోట విన్నా సారూ, కారూ, కె సిఆర్ మాటేనని కాంగ్రెస్, బిజెపిల పని ఖాళీ అన్నారు. 300 కిలోమీటర్ల స్పీడ్‌తో కెసిఆర్ కారు దూసుకుపోతోందని, ఏ పార్టీ మా కారుకు అడ్డొచ్చినా నలిగిపోవడం ఖాయమని, హ్యాట్రిక్ కెసిఆర్ చరిత్ర సృష్టిస్తారని అన్నారు. అసలు కెసిఆర్ దేశ ప్రధాని అయితేనే దేశం బాగుపడుతుందని, మళ్లీ హ్యాట్రిక్ సాధిస్తా అని జీవన్‌రెడ్డి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News