Monday, April 29, 2024

ఇదేం పోలీసు: అసదుద్దీన్ ఓవైసీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘నగరంలో శ్రీరామ నవమి వేడుకలప్పుడు ఊరేగింపులో నాథురామ్ గాడ్సే ఫోటోను ప్రదర్శిస్తుంటే నగర పోలీసులు ఏమి చేస్తున్నట్లు?’ అని పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ‘జాతిపిత మహాత్మా గాంధీని చంపిన దేశ తొలి ఉగ్రవాది నాథురామ్ గాడ్సే ఫోటోను వారు ఊరేగింపులో ప్రదర్శించారు. ఎవరు వారు? వారి మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మౌనంగా ఎందుకు కూర్చుని ఉన్నారు? అదే ఎవరైనా ఉసామా బిన్ లాదెన్ ఫోటోను ఇదే రీతిలో ప్రదర్శించి ఉంటే వారి ఇంటి తలుపులు బద్ధలు కొట్టి మరీ పట్టుకునేవారు కదా?’అని ఆయన ప్రశ్నించారు. నగరంలోని షేక్‌పేట్‌లో ఉన్న మస్జిద్‌-ఇ-ఫారూఖ్ లో ఏర్పాటు చేసిన జల్సా సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గోషామహల్ బిజెపి ఎంఎల్‌ఎ రాజా సింగ్ దండు మార్చి 30న శ్రీరామ నవమి ప్రధాన ర్యాలీలో కలుసుకున్నప్పుడు గాడ్సే చిత్రపటాన్ని ప్రదర్శించారు. నాథూరామ్ గాడ్సేను హిందుత్వ వాదిగా కొందరు చూపేట్టాలనుకున్నారు. నాడు శ్రీరామ నవమి వేడుకల్లో డిజె పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, హిందూత్వ పాటలు, రెచ్చగొట్టే ప్రసంగాలు చోటుచేసుకున్నాయి. రాజాసింగ్‌ను తెలంగాణ కోర్టు పబ్లిక్ మీటింగ్స్ నుంచి నిషేధించినప్పటికీ ఆయన శ్రీరామ నవమి సందర్భంగా చిన్న ప్రసంగం చేశారు. ‘ఒక్కో హిందూ పదివేల మందితో తలపడగలడు, హిందూ దేశాన్ని ఏర్పాటు చేయడానికి మనం దేనికీ భయపడనవసరంలేదు’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు రాజా సింగ్. 2022లో కూడా రాజా సింగ్ ‘రాముడి పేరును ఉచ్ఛరించని వారిని తన్ని తగలేస్తాము’ అన్నారు. ఈ మధ్య కాలంలో ఆయన ముస్లింల ప్రవక్త(స) ముహమ్మద్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు పిడి చట్టం కింద బుక్ అయ్యారు కూడా.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News