ఆలయ ట్రస్టుకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంతోపాటు ఆ ఆలయ ట్రస్టుకు సంబంధించిన గడచిన 25 సంవత్సరాల జమాఖర్చులను ఆడిట్ చేయాలంటూ గత ఏడాది ఇచ్చిన ఆదేశాల నుంచి తమను మినహాయించాలని కోరుతూ ఆ ఆలయ ట్రస్టు చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. మూడు నెలల్లోగా ఆడిట్ పూర్తి చేయాలంటూ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ట్రస్టును ఆదేశించింది. ఆలయానికి మాత్రమే ఆడిటింగ్ పరిమితం కాదని, ట్రస్టు లెక్కలపై కూడా ఆడిటింగ్ జరగాల్సిందేనని ధర్మాసనం పేర్కొంది. 2015లో అమికస్ క్యూరీ(కోర్టు సహాయకుడు) తన ఉత్తర్వులలో పేర్కొన్న మేరకు ఈ ఆదేశాలు జారీచేస్తున్నామని జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
తాము చాలా ఆర్థికపరమైన ఒత్తిడులను ఎదుర్కొంటున్నామని, ఆలయ ఖర్చులను తట్టుకోవడానికి వచ్చే ఆదాయం సరిపోవడం లేదంటూ ఈ నెల 17న ఆలయ నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. కేరళలో అన్ని ఆలయాలు మూతపడ్డాయని, అయితే శ్రీ పద్మనాభస్వామి ఆలయానికి సంబంధించి ప్రతి నెల రూ. 1.25 కోట్లు నిర్వహణా వ్యయం అవుతోందని, తమకు కేవలం రూ. 60-70 లక్షలు మాత్రమే ఆదాయం సమకూరుతోందని ట్రస్టు తరఫున సీనియర్ న్యాయవాది ఆర్ బసంత్ కోర్టుకు తెలిపారు.