హైదరాబాద్: వరిధాన్యం, మొక్కజొన్న పంటను ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనుగోలు చేసేందుకు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎంఎల్ఎసి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుంచి ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని వెల్లడించారు. రైతులకు ఎటువంటి సమస్య ఎదురైనా 7288894807, 7288876545 నెంబర్లకు ఫోన్ చేసి చెప్పాలన్నారు. పంట ఉత్పత్తుల కొనుగోళ్లపై ఆయన మంగళవారం కంట్రోల్ రూమ్లో వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ, రైతుబంధు సమితి, మార్కెటింగ్ శాఖ , పౌరసరఫరాల శాఖ, మార్క్ఫెడ్ అధికారులు కంట్రోల్ రూమ్లో అందుబాటులో ఉంటారన్నారు.
గ్రామస్థాయిలో ధాన్య సేకరణలో రైతులు ఎదుర్కొనే సమస్యలు, వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. అదే విధంగా కంట్రోల్ రూమ్ నుంచి ప్రతిరోజు జిల్లాల వారీగా ధాన్య సేకరణ కేంద్రాల ఏర్పాటు, సేకరించబడిన ధాన్యం, ఎన్ని ఎకరాలలో పంటకోత కోస్తున్నారనే వివరాలు సేకరించి, రాష్ట్ర స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారన్నారు. వరి కోత యంత్రాలు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సమస్య, ధాన్య సేకరణ సమస్యలపై మాత్రమే ఈ కంట్రోల్ రూమ్ను రైతులు వినియోగించుకోవాలని పల్లా సూచించారు. ఈ కంట్రోల్ రూమ్ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందన్నారు. కంట్రోల్ రూమ్లో ఉండే అధికారులు సమస్యలను ఎప్పటికప్పుడూ సంబంధిత శాఖ అధికాకుల తెలియజేసి పరిష్కరిస్తాని తెలిపారు.