హైదారాబాద్ : భారతదేశ వ్యాప్తంగా విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ 25 ఐపిఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) అధికారులలో రాష్ట్ర డిజిపి ఎం మహేందర్రెడ్డికి స్థానం లభించింది. ఫేమ్ ఇండియా, పిఎస్యు వాచ్, ఆసియా దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన 25 మంది ఐపిఎస్ల పనితీరుపై సర్వే చేపట్టిన ఆ జాబితాను మంగళవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా టాప్ 25 ఐపిఎస్ అధికారులను గుర్తించేందుకు ఫేమ్ ఇండియా, పిఎస్యు వాచ్, ఆసియా పోస్ట్ (మూడు సంస్థలు) దేశవ్యాప్తంగా సర్వే చేపట్టాయి. ఈక్రమంలో దేశంలో 4000 మంది ఐపిఎస్ అధికారుల పనితీరును పరిశీలించిన సదరు సంస్థలు మొదట 200 మంది ఐపిఎస్ అధికారులను గుర్తించారు. అనంతరం ఏజెన్సీ, మీడియా నివేదికల యొక్క అంతర్గత నివేదికల ఆధారంగా, సదరు సంస్థలు 200 మంది ఐపిఎస్లలో టాప్ 25 అధికారుల జాబితా రూపొందించారు. ఆ జాబితాలో రాష్ట్ర డిజిపి మహేందర్రెడ్డి పేరును ప్రకటించింది.
కాగా 1986 ఐపిఎస్ బ్యాచ్కు చెందిన ఎం మహేందర్రెడ్డి తొలుత కరీంనగర్లో గోదావరిఖని అసిస్టెంట్ ఎస్పిగా విధులు చేపట్టాడు. కాలక్రమంలో ఆయన నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాల ఎస్పి హోదాలో పనిచేశారు. అనంతరం నగరంలోని ఈస్ట్ జోన్ డిసిపి, హైదరాబాద్ పోలీసు కమిషనర్గానూ ఆయన పనిచేశారు. సీనియర్ ఐపిఎస్ అధికారి మహేందర్రెడ్డి నవంబర్ 12, 2017 న తెలంగాణ డిజిపిగా నియమితులయ్యారు.
ఈ సందర్బంగా పిఎస్యు వాచ్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ శుక్లా ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఐపిఎస్ అధికారిగా నక్సలిజం, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల, మానవ అక్రమ రవాణా వంటి అంతర్జాతీయ నేరాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిని ఎంపిక చేసినట్లు తెలిపారు. అలాగే నేరాలను నియంత్రించే సామర్థం, నిజాయితీ, శాంతిభద్రతలను మెరుగుపరిచే సామర్థాలను ప్రమాణికంగా తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం, త్వరగా నిర్ణయాలు తీసుకునే సామర్థం ఉన్న అధికారులకు ప్రాముఖ్యత నిచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా టాప్ 25 ఐపిఎస్ అధికారులలో ఒకరిగా ఎంపికైన డిజిపి మహేందర్రెడ్డిని తెలంగాణ ఐజి ఆఫ్ పోలీస్ (ఉమెన్స్ సేఫ్టీ) స్వాతి లక్రా అభినందించారు.