Monday, April 29, 2024

పవన్ పరువు నిలిపేనా !

- Advertisement -
- Advertisement -

అభ్యర్ధుల ఆశలన్ని అధినేత పైనే
8 చోట్లా స్థబ్దతగా జనసేన ప్రచారం

మన తెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ పరువు ప్రతిష్టలన్నీ ఆ పార్టీ అధినేత సినీనటులు కొణిదెల పవన్ కళ్యాణ్‌పైనే ఆధారపడి ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీతో పొత్తుపెట్టుకున్న జనసేన తెలగాంగాణ అసెంబ్లీ ఎన్నిల్లో 32 నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్టు తొలుత ప్రకటించినా ఎన్నికల్లో సీట్ల కేటాయింపుల విషయంలో బిజెపితో జనసేన అధినేత సర్దుబాటు ధోరణి కనబరిచారు.రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఎనిమిది సీట్లతో సరిపెట్టుకున్న పవన్ కళ్యాణ్ పోటీలో అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించారు. ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చే అభ్యర్ధులకే టిక్కెట్లు కట్టబెట్టారు. జనసేన పార్టీ బి-ఫాంలు ఇచ్చి అభినందనలు తెలిపిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ తరువాత నియోజకవర్గాల వారీగా ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఒకవైపు నామినేషన్ల ఉససంహరణ ప్రక్రియ కూడా ముగిసి పోయింది. ఎన్నికల సంఘం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రాష్ట్రంలో పోటీ చేస్తున్న అభ్యర్ధుల తుదిజాబితాలను కూడ ప్రకటించింది. మరో వైపు ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్నారు.

పవన్ కోసం ఎదరు చూపులు :
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిజనసేన పార్టీ అభ్యర్ధులు ఆశలన్ని పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌పైనే పెట్టుకున్నారు. ఇప్పటివరకూ పార్టీ తెలంగాణ రాష్ట్రకార్యాలయం ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను ప్రకటించలేదు. ఎన్నికలో బరిలో ఉన్న ఆధికార భారత రాష్ట్ర సమితి పార్టీతోపాటు కాంగ్రెస్ , భారతీయ జనతాపార్టీల అగ్రనేతలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపైనే పూర్థి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ప్రధాని నరేంద్రమోడి ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ కు ఇప్పటికే రెండు పర్యాయాలు వచ్చివెళ్లారు.అయితే అందులో ఒక్క సారి మాత్రమే ప్రధాని సభలో పాల్గొన్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ తరువాత ఎమ్మార్పీఎస్ నేత అధ్యక్షనత జరిగిన సభకు హాజరు కాలేదు. బిజేపి జనసేన పార్టీల మధ్య పరిస్థితి ఎన్నికల పొత్తు వరకే పరిమితం అన్నట్టుగా సాగుతోంది. ఉమ్మడిగా ఎన్నికల ప్రణాళికల ఊసే కనిపించటం లేదు. బిజేపి కూడా జనసేనతో నిమిత్తం లేకుండా సొంత అజెండాతోనే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఇంకా తన ఎన్నికల వ్యూహం ఎమిటన్నది బయటపెట్టలేదు. ఎన్నికల ప్రచారం పైకూడా అధికారికంగా ఏవిధమైన్ర ప్రకటన చేయలేదు.

ఆ ఎనిమిదిచోట్ల ఉనికి చాటుతారా!
జనసేన పార్టీ తన అభ్యర్దులను ఎనిమిది చోట్ల పోటికి నిలిపింది. కూకట్‌పల్లిలో భారాస నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కాంగ్రెస్ అభ్యర్ధి బండి రమేష్‌తో జనసేన అభ్యర్ధి ఎం ప్రేమ్‌కుమార్ ఢీకొంటున్నారు. ఇక్కడ సెటిలర్ల ఓట్లపైనే జనసేన ఆశలు పెట్టుకుంది. పార్టీ అధిష్టానం ఇక్కడ అనుసరించే వ్యూహాన్ని బట్టే జనసేన అభ్యర్ధి ఎన్నికల ప్రచారం ముందుకు సాగనుంది. నాగర్‌కర్నూల్‌లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే బిఆర్‌స్ అభ్యర్ధిగా మర్రి జనార్ధన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా రాకేష్‌రెడ్డిపై జనసేన అభర్ధి వి.లక్ష్మణ్ గౌడ్ తలపడుతున్నారు. కోదాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే బిఆర్‌ఎస్ అభ్యర్ధి బొల్లం మల్లయ్య యాదవ్, కాంగ్రెస్ అభ్యర్ధి మాజీ ఎమ్మెల్యే ఎన్ పద్మావతిపైన జనసేన అభ్యర్దిగా మేకల సతీశ్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్, కాంగ్రెస్ అభ్యర్ధి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావుపైన జనసేన అభ్యర్ధిగా ఎం రామకృష్ణ తలపడుతున్నారు. ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గ వైరా నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థి బానోతు మదన్‌లాల్ , కాంగ్రెస్ నుంచి మాలోతే రాందాస్‌లపై జనసేన అభ్యర్ధిగా టి.సంపత్ నాయక్ పోటీలో ఉన్నారు. మరో ఎస్టీ నియోజకవర్గం అశ్వారావుపేట నుంచి బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మెచ్చానాగేశ్వరరావు , కాంగ్రెస్ నుంచి జే ఆదినారాయణలపై జనసేన అభ్యర్దిగా ఎం ఉమాదేవి తలపడుతున్నారు.కొత్తగూడెం నుంచి బిఆర్‌ఎస్ సిట్టింగ్ వనమా వెంకటేశ్వరరావు , కాంగ్రెస్‌పొత్తుల సిపిఐ అభ్యర్దిగా కె.సాంబశివరావులపైన జనసేన నుంచి ఎ.సురేందర్ రావు పోటీలో ఉన్నారు. తాండూర్ నుంచి బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మేల్యే రోహిత్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి బి.మనోహర్ రెడ్డిలపైన జనసేన అభ్యర్థిగా శంకర్‌గౌడ్ పోటీలో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News