హైదరాబాద్: నగరంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాబోయే మూడు రోజులలో వర్షపాతం అంచనా దృష్ట్యా, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షానికి సంబంధించిన సమస్యలపై అధికారులను సంప్రదించాలని కోరారు. లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను సహాయ శిబిరాలకు తరలించాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా అన్ని చర్యలను అనుసరించాలని ఆదేశించారు. వరద బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులకు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ముంపు ప్రాంతాల్లో సాధారణ స్థితి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. నిన్న సాయంత్రమే 2100 కుటుంబాలను ఖాళీ చేయించామని పేర్కొన్నారు. నగరంలో 35,309 కుటుంబాలు ముంపు బారిన పడ్డాయని జిహెచ్ఎంసి కమిషనర్ వివరించారు. బాధిత కుటుంబాలకు రూ. 2800 విలువైన వస్తువులు ఇస్తున్నామన్నారు. వరద బాధితులకు ఇప్పటివరకు 20వేల రేషన్ కిట్స్, దుప్పట్లు పంపిణీ చేశామని, మిగిలిన వారికి రేపు సాయంత్రానికల్లా సరుకులు అందిస్తామని భరోసా ఇచ్చారు. ముంపు బాధితులకు నీరు, పాలు, బ్రెడ్, బిస్కట్లు అందజేస్తున్నామని లోకేష్ కుమార్ తెలిపారు.