మార్గదర్శకాల సమర్పణకు కేంద్రానికి సుప్రీం ఎక్కువ గడువు మంజూరు
న్యూఢిల్లీ : కొవిడ్తో అనాథలైన పిల్లలను ఆదుకోడానికి ఇటీవలనే ప్రారంభించిన పిఎం కేర్స్ పథకం తాలూకు మార్గదర్శకాల సమర్పణకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సోమవారం ఎక్కువ గడువు మంజూరు చేసింది. కరోనా వల్ల అనాధలైన పిల్లల వివరాలు పంపడంలో పశ్చిమబెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించడం లేదని జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ (ఎన్సిపిఆర్ )సుప్రీం కోర్టుకు తెలియచేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి ఈమేరకు మార్గదర్శకాల రూపకల్పనకు రాష్ట్రాలు, మంత్రిత్వశాఖలతో సంప్రదిస్తున్నామని వీటిని రూపొందించడానికి కొంత గడువు కావాలని ధర్మాసనాన్ని కోరారు.
ఇంతవరకు రాష్ట్రాలు సమర్పించిన వివరాల ప్రకారం కరోనా వైరస్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన పిల్లలు 9346 మంది ఉన్నారని, వీరిలో 1742 మంది తల్లిదండ్రులిద్దరినీ కోల్పోగా, 7464 మంది తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయారని ఎన్సిపిఆర్ తన అఫిడవిట్లో కోర్టుకు వివరించింది. కరోనా వల్ల అనాధలైన పిల్లలను పిఎం కేర్స్ పథకం కింద తక్షణం గుర్తించాలని, ఈలోగా రాష్ట్రాలు తక్షణ సాయం అందించాలని కోరుతూ అమికస్ క్యూరీ సమర్పించిన దరఖాస్తుపై ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని మార్గదర్శకాలు సమర్పించాలని ఆదేశించింది.