Monday, April 29, 2024

కేంద్రంలో కాంగ్రెస్ అవినీతిని చూడలేక బిజెపికి అధికారం ఇచ్చారు : మోడీ

- Advertisement -
- Advertisement -

మెదక్ : గత కాంగ్రెస్ పాలనలో ఏనాడైనా బిసి బిడ్డను ముఖ్యమంత్రిని చేసిన దాఖలాలు ఉన్నాయా దీనిపై ప్రజలు ఒక్కసారి ఆలోచించి బిజెపికి పట్టం కట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం తూప్రాన్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన పాల్గొని నరేంద్రమోడీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. దుబ్బాక, హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో తాము తమ బలాన్ని ట్రైలర్‌గా చూపించామని, ఇప్పుడు రాష్ట్రమంతా చూపించబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. దేశంలో అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం పాలించడం వల్లనే దేశ ప్రజలు 2014లో బోఫోర్స్ నుంచి హెలికాప్టర్ కొనుగోలు వరకు అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కకు జరిపి సమర్థవంతమైన బిజెపి పార్టీకి అధికారాన్ని ఇచ్చారని ఆయన చెప్పారు. బిజెపి ప్రభుత్వం ప్రజలకు గౌరవప్రదమైన సుపరిపాలన అంది స్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గజ్వేల్ నియోజకవర్గంలో సమర్థుడైన తమ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు భయపడి గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలో కూడా పోటీ చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు.

కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధి కూడా ప్రజా వ్యతిరేకతకు భయపడి అమేతిని వదిలి వారణాసిలో పోటీ చేశారని తెలిపారు. తెలంగాణలో బిజెపికి అధికారం ఇస్తే తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని మోడీ తెలిపారు. సిఎం కెసిఆర్ ఫామ్‌హౌస్ నుంచే పరిపాలన సాగిస్తున్నారని సచివాలయానికి రాడని గతంలో ఇలా ఎవరూ చేయలేదని మోడీ అన్నారు. కాంగ్రెస్, కెసిఆర్ ఇద్దరు ఒకటేనని ప్రజలు వీరిద్దరి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రదాని సూచించారు. బిజెపి వల్లనే తెలంగాణ ప్రతిష్ట పెరుగుతుందని ప్రధాని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిపాలన సాగించినప్పుడు ఎవరైనా బిసి బిడ్డలు ముఖ్యమంత్రి అయ్యారా అనేది ప్రజలు ఆలోచించాలని బిజెపి ప్రభుత్వం వస్తే తెలంగాణలో బిసిలు ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాని స్పష్టం చేశారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధాన్యం కొనుగోలు ధరను క్వింటాలుకు రూ. 3100 పెంచి ఇస్తామని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం అందించడం బిజెపితోనే సాధ్యమవుతుందని, ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని ఇందుకోసం ఒక కమిటీని కూడా వేశామని ఆయన అన్నారు.

అంతకుముందు గజ్వేల్ అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడుతూ కెసిఆర్‌ను ఓడించడానికే తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తు న్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు నరేంద్రమోడీ ప్రభుత్వమే నిధులను అందిస్తున్నట్లు తెలిపారు. నరేంద్ర మోడీ పాల్గొన్న బహిరంగ సభకు ఉమ్మడి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సభలో ఏడు నియోజకవర్గాలకు చెందిన గజ్వేల్, సిద్దిపేట,దుబ్బాక, మెదక్, నర్సాపూర్, పటాన్‌చెరు, సంగారెడ్డి నియోజకవర్గాలకు చెందిన పార్టీ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News