ఈ నెల 24తో కమిషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో పొడిగింపు ఉత్తర్వులు
మన తెలంగాణ/హైదరాబాద్ : వేతన సవరణ కమిషన్ (పిఆర్సి) గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఈ నెల 24తో కమిషన్ గడువు పూర్తవుతుంది. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా డిసెంబర్ 31 వరకు గడువును పెంచింది. మార్చిలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉండడం, దీంతోపాటు పిఆర్సి కమిటీ సైతం గడువును పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. పిఆర్సి వ్యవహారాలే కాకుండా రాష్ట్ర కార్యాలయాలు, జిల్లాలో వర్క్లోడ్, ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు, ఉండాల్సిన సిబ్బంది సంఖ్య, ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు నిబంధనలు తదితర అంశాలను తేల్చే బాధ్యతలను ప్రభుత్వం పిఆర్సి కమిటీ అప్పగించింది. వీటిపై కసరత్తు చేసేందుకు పిఆర్సి కమిటీ మరింత సమయం అవసరం కావడంతో డిసెంబర్ వరకు గడువును ప్రభుత్వం పొడిగించింది.
అంతలోపు ఉద్యోగులకు ఉపశమన చర్యలు
పిఆర్సి గడువుతో పాటు ఉద్యోగుల వయోపరిమితి పెంచాలన్న ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిఆర్సి పెంపుతో పాటు ఉద్యోగుల వయోపరిమితిని ఒకేసారి అమలు చేయాలన్న ఉద్ధేశ్యంతో పిఆర్సి గడువును పొడిగించినట్టుగా సమాచారం. అంతలోపు ఉద్యోగులకు కొంత ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది.
10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని
హుజూర్నగర్ ఉప ఎన్నికల సమయంలో ఆర్టిసి సమ్మె జరుగుతుండడంతో ఉద్యోగ జెఎసి నేతలను సిఎం కెసిఆర్ పిలిచి భోజనం పెట్టి, ఎన్నికలు కాగానే భేటీ ఉంటుందని సంకేతాలిచ్చారు. గడిచిన నవంబర్ 10వ తేదీన 10- రోజుల్లో నివేదిక ఇవ్వాలని పిఆర్సి కమిటీని సిఎం ఆదేశించారు. అయినా పిఆర్సి కమిటీ నివేదిక ప్రభుత్వానికి చేరలేదు.
అధికారుల నిర్లక్షం వల్లే పిఆర్సి ఆలస్యం
సిఎం కెసిఆర్ తెలంగాణ వచ్చాక ఇన్ టైంలో పిఆర్సి ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే పిఆర్సిపై త్రీ మెన్ కమిటీని సిఎం వేశారు. అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహారిస్తూ పిఆర్సిని ఆలస్యం చేస్తున్నారు. ఇప్పటికే అధికారుల నిర్లక్షం వల్ల రెండు పిఆర్సిలను కోల్పోయాం. ఇప్పటికే కొత్తగా జిల్లాల ఏర్పాటు చేసి, జిల్లాలో ఆప్షన్లు ఇచ్చి ఉద్యోగులు కెసిఆర్ అవకాశం కల్పించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మొదటి ప్రాధాన్యత కెసిఆర్ ఉద్యోగులకే ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాల సంతృప్తి చెందేలా సిఎం పిఆర్సి ఇస్తారని తాము ఆశిస్తున్నాం. పిఆర్సి సమయం పొడిగించినా రానున్న రోజుల్లో ఉద్యోగులు సంతోషపడేలా కెసిఆర్ నిర్ణయం ఉంటుందని తామంతా భావిస్తున్నాం.