ఎల్ఇడి టివిలను తయారు చేసే మొదటి కంపెనీ : కెటిఆర్ ట్వీట్
హైదరాబాద్ : హైదరాబాద్ శివారులో ఎల్ఇడి టివిలను తయారు చేసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసే మేటి కంపనీగా రేడియంట్ అప్లియెన్సెస్ నిలువనున్నదని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు తన ట్విట్టర్లో పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్లో లీడర్గా వ్యవహరిస్తున్న సాంసంగ్, ఇతర పేరున్న బహుళజాతి సంస్థలకు ఎల్ఇడి టివిలను రేడియంట్ సంస్థ సరఫరాచేస్తున్నది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన మహేశ్వరం పట్టణ ప్రదేశంలో ఎల్ఇడి, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ యూనిట్ను ప్రారంభించనున్నది రేడియంట్ అప్లియెన్సెస్ సంస్థ. గత 25 సంవత్సరాలుగా టివిలు, ఎలక్ట్రానిక్ పరికరాలను తయారుచేయడంలో అనుభవమున్న రేడియంట్ అప్లియెన్సెస్ సంస్థ హైదరాబాద్ శివారులో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమని మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్లో వెల్లడించారు. ఈ తయారీ కేంద్రంతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి.