సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్యపై ‘మర్డర్’ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఫాదర్స్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ను ఆయన విడుదల చేశాడు. ఇక తన జీవితాన్ని సినిమాగా చేస్తున్న రాంగోపాల్ వర్మపై బాధితురాలు అమృత ఆగ్రహం వ్యక్తం చేసిందని… ఈ సినిమా గురించి స్పందించిందంటూ ఒక ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. “నా జీవితం మరోసారి తలకిందులైంది.
మా కథ సినిమాగా చెప్పేముందు ఆ దర్శకుడు మా అనుమతి తీసుకోవాలని తెలియదా? నా జీవితానికి ఆ సినిమాకు ఎటువంటి సంబంధం లేదు. ఓ కట్టుకథకు మా పేర్లు పెట్టుకొని అమ్ముకోవాలని చూస్తున్నాడు. ఈ పనితో ఆయనకు పబ్లిసిటీ వస్తుంది. నా భర్త హత్య జరిగినప్పటి నుంచి ఒత్తిడితో జీవిస్తున్నా.. మహిళను ఎలా గౌరవించాలో చెప్పే తల్లి లేనందుకు అతడిపై జాలిపడుతున్నా” అంటూ వర్మపై అమృత నిప్పులు చెరిగింది.
కాగా అమృత వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో స్పందించాడు. ఈ సినిమాలో ఎవరినో చెడ్డవారిగా చూపించబోతున్నానని అనడం మూర్ఖత్వమని వర్మ అన్నాడు. ఎవరూ చెడ్డ వారు కాదని.. పరిస్థితులే మనిషిని చెడుగా ప్రవర్తించేలా చేస్తాయని చెప్పాడు. అమృత, ఇంకెవరైనా సరే వేధన అనుభవించిన వారిపై నాకు చాలా గౌరవం ఉందని.. వారు ఎదుర్కొన్న పరిస్థితులనే తాను ‘మర్డర్’ సినిమాలో చూపిస్తానని వర్మ తెలిపాడు. నిజజీవిత కథ ఆధారంగానే తెరకెక్కుతున్న ఈ సినిమాలో నేను తీసిందే నిజమని ఎక్కడా చెప్పడం లేదని ఆయన పేర్కొన్నాడు. నా అభిప్రాయం ఏంటనేది సినిమా విడుదలయ్యాక తెలుస్తుందన్నాడు. కథ గురించి ఇప్పుడే చెప్పడం అవివేకం అని వర్మ ట్వీట్లో పేర్కొన్నాడు.
అమృత స్పందించలేదు…
రాంగోపాల్వర్మ ‘మర్డర్’ చిత్రంపై అమృత వ్యాఖ్యల పేరిట సోషల్ మీడియాలో వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మామయ్య బాలస్వామి పేర్కొన్నాడు. ఇప్పటివరకు ‘మర్డర్’ సినిమా గురించి అమృత ఏవిధంగానూ స్పందించలేదని చెప్పాడు. ఆమె పేరుతో వస్తోన్న స్టేట్మెంట్స్ను నమ్మవద్దని అన్నాడు.