Monday, April 29, 2024

మహిళలకు కోటా ఇంకెప్పుడు?

- Advertisement -
- Advertisement -

ఒక దేశ ప్రగతి, పురోగతి స్త్రీ పురుష సమానత్వంపై ఆధారపడి ఉంటుంది. మానవ వనరుల్లో సగభాగమైన మహిళలకు ప్రాధాన్యమిస్తున్న దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది అగ్రస్థానంలో నిలిచాయి.స్త్రీ పురుష అసమానతలు ఎక్కువగా వున్న దేశాలు ఆర్థికంగా ఆశించిన మేరకు అభివృద్ధి చెందలేదు. ప్రపంచ ఆర్థిక ఫోరం 2022 నివేదిక ప్రకారం లింగ సమానత్వంలో భారత దేశం ప్రపంచంలోని 146 దేశాల్లో 135వ స్థానంలో నిలిచింది. స్త్రీ పురుష సమానత్వం కోసం తీసుకున్న నాలుగు ప్రధాన అంశాలు తీసుకొని అంచనా వేశారు. 1 ఆర్థిక భాగస్వామ్యంలో 143వ స్థానం, రాజకీయ సాధికారిత అధికారం లో 48వ స్థానం, విద్యాభ్యాసంలో 107వ స్థానంలో నిలిచిన భారత దేశం వైద్యరంగంలో అట్టడుగు 146వ స్థానంలో వుంది. సమానత్వ సూచీలో 135వ స్థానంలో ఉన్న మన దేశం తర్వాత కేవలం 11 దేశాలు మాత్రమే ఉన్నాయి. మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్, నేపాల్ లాంటి చిన్నదేశాలు స్త్రీ పురుష సమానత్వంలో మనకంటే ముందు ఉన్నాయి. దేశంలో లోక్‌సభలో 543 పార్లమెంట్ సభ్యులు ఉంటే మహిళా సభ్యులు 66 మంది మాత్రమే వున్నారు. మొదటి లోక్‌సభలో మహిళా ఎంపిల సంఖ్య 22 కాగా, ప్రస్తుత లోక్‌సభలో మహిళా ఎంపిల సంఖ్య 66 మాత్రమే. అధికార పార్టీ గాని, ప్రతిపక్షాలు గాని మహిళా సాధికారితను మాటలకే పరిమితం చేశాయి.

మహిళా ప్రాతినిధ్యం పెంచడానికి కృషి చేయలేదు. జనాభాలో సగం వున్న మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్స్ చట్టం చేయడానికి రాజకీయ పార్టీలు మీనమేషాలు లెక్కిస్తూ తీవ్ర జాప్యం చేస్తున్నారు. మహిళలకు ఒకసారి సీట్లు రిజర్వ్ చేస్తే శాశ్వతంగా తమకు అధికారం దక్కదన్న భావన మహిళా బిల్లు ఆమోదం కాకుండా అడ్డుపడుతున్నాయి. 1996లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అనేక పరిణామాలు అపరిమిత ఆలస్యం తర్వాత 2010 లో బిల్లును రాజ్యసభ ఆమోదించింది. నాటి లోక్‌సభ కాల పరిమితి తీరిపోవడంతో ఆ బిల్లు అమలుకు నోచుకోలేదు. మహిళా సాధికారిత సాధనకు కట్టుబడి వున్నామని, మహిళా సంక్షేమమే మానవ సంక్షేమమని, చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడతామని ఎన్నికల మేనిఫెస్టోల్లో ప్రకటిస్తున్నాయి. దేశానికి స్వాతం త్య్రం వచ్చి 75 సంవత్సరాలైనప్పటికీ జనాభాలో సగం వున్న మహిళలకు శాసన నిర్మాణంలో అతి తక్కువ స్థానాలు ఇవ్వడం సమంజసం కాదు. తక్కువ సంఖ్యలో వున్న వారు అధికారాన్ని చెలాయిస్తూ అధిక సంఖ్యాకులైన మహిళలు, వెనుకబడిన వర్గాలు రాజ్యాధికారానికి దూరంగా ఉండడం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని రాజనీతి వేత్తలు, న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

2022 లెక్కల ప్రకారం అమెరికా, యూరపు, ఆఫ్రికా ప్రాంతాలలో జాతీయ పార్లమెంట్‌లో సగటు 26.2% కన్నా ఎక్కువ మంది మహిళలు ఎంపిలుగా వున్నారు. నేపాల్‌లో 34%, బంగ్లాదేశ్ 21% పాకిస్థాన్ 20% భూటాన్ 17% మన దేశం కన్న మెరుగ్గా ఉన్నాయి. ఆసియా దేశాల్లో 19.2% అరబ్ దేశాల్లో 18.4%, పసిఫిక్ దేశాల్లో 13.5 శాతం వుంది. మన దేశంలో 10 15% లోపు మహిళా ఎంపిలు వున్నారు. ప్రపంచం మొత్తం మీద కేవలం రెండు దేశాల్లో మాత్రమే పార్లమెంట్లో 50% కంటే ఎక్కువ మహిళా ప్రాతినిధ్యం కలిగి వున్నారు. 2016 జూన్ గణాంకాల ప్రకారం రువాండా దేశంలో 63.8%, బోలివియాలో 53.1% మహిళా ప్రాతినిధ్యం వుంది. ఎన్నికల్లో పోటీ చేస్తే పురుషుల కన్నా మహిళలకే విజయావకాశాలు ఎక్కువ వుంటాయి. మహిళలు పోటీ చేస్తున్న స్థానాల్లో ఎన్నికల వ్యయం తక్కువ వుంటుంది. సమాజంలో సగభాగమున్న మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా మహిళలకు ప్రజాస్వామిక న్యాయం జరుగుతుంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య లక్ష్యం నెరవేరుతుంది. రాజ్యాంగంలో పొందుపరచిన స్త్రీ పురుష సమానత్వం అందరికీ సమాన అవకాశాలు కల్పించినప్పుడే సామాజిక, ఆర్థిక, రాజకీయ పంపిణీ న్యాయం సిద్ధిస్తుంది. రాజకీయ పార్టీలు మహిళలకు చట్టసభల్లో కచ్చితమైన శాతాన్ని రిజర్వు చేస్తేనే ఆయా పార్టీల గుర్తింపు కొనసాగుతుందనే నిబంధన ఎన్నికల కమిషన్ విధించాలని గిల్ ఫార్ములా సిఫారసు చేసింది. ఈ దిశగా ఎన్నికల కమిషన్ సమగ్ర సంస్కరణలు అమలు చేయాలి.

అన్నిరాజకీయ పార్టీలు మహిళలకు చట్టసభల్లో వారి జనాభా దామాషా ప్రకారం టికెట్టు ఇచ్చి వారికి చట్ట సభల్లో సముచిత స్థానం ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రివర్గంలో మహిళలకు స్థానం ఇవ్వాలి. స్థానిక సంస్థల ప్రత్యక్ష ఎన్నికల్లో 1/3 వంతు సీట్లు మహిళలకు కేటాయిస్తూ ప్రవేశపెట్టిన చట్టాలు సమర్థవంతంగా అమలు చెయ్యాలి. రాజకీయ పార్టీలు మహిళలకు చట్టసభల్లో టికెట్లు ఇవ్వడానికి పార్టీలపరంగా నియమ నిబంధనలు రూపొందించుకోవాలి. పార్టీల రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలి. మహిళా సంఘాలు, స్వశక్తి మహిళా గ్రూపులు, డ్వాక్రా మహిళలు ప్రతి గ్రామ పంచాయితీ స్థాయిలో వున్న తల్లుల సంరక్షణ సంఘాలు పొదుపు సంఘాల ప్రతి నెల జరిగే సమావేశాల్లో మహిళా సాధికారిత సాధన మహిళల రాజకీయాల పట్ల చర్చించి అవగాహన పెంచుకోవాలి. మహిళలను కించ పరిచే అన్ని రకాల వివక్షలను రూపుమాపాలి. స్త్రీలను చిన్నచూపు చూసే సమాజ పరిస్థితులు మారాలి.

మహిళల పట్ల గౌరవం పెరగాలి. ఆడ మగ అనే విచక్షణ పాటించకుండా స్త్రీ పురుషులు ఇద్దరు సమాజ ప్రగతి రథానికి చక్రాలలాంటి వారని సమాజం భావించాలి. స్త్రీ పురుష సమానత్వం సమాన అవకాశాల కల్పన కుటుంబం నుండే ప్రారంభం కావాలి. నూతన విద్యా విధానంలో లింగ వివక్షత స్త్రీ పురుష అసమానతలు రూపుమాపే సమానత్వం, సమాన అవకాశాల మీద పాఠ్యాంశాలు ప్రవేశపెట్టి విద్యార్థి దశలోనే లింగ సమానత్వ సాధనకు ఉపకరించే విద్యా పాలన సంస్కరణలు అమలు చెయ్యాలి. విద్య, వైద్యం పోషకాహారం అన్ని రంగాలలో సరైన న్యాయం కల్పించాలి. మానవీయ కోణంలో లింగ సమానత్వం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక మహిళాభివృది వ్యూహాలను రూపొందించింది అమలు చేయాలి. మహిళాభివృద్ధే మానవాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర మహిళా వికాసానికి ఉపక్రమిస్తుందని ఆశిద్దాం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News