ఫీజు చెల్లింపులు కూడా ఇక్కడే
గ్రామాల్లోని భూములకు మాత్రమే అవకాశం
పట్టణాల్లో సాదాబైనామాలకు అవకాశం లేదు
2016, 17లో రెవెన్యూ శాఖ గుర్తించిన
హెచ్ఎండిఏ, కుడాలలోని కొన్ని ప్రాంతాలకు మాత్రం వర్తింపు
మండలాలు, గ్రామాల జాబితాతో పాటు
మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్ : సాదాబైనామాలకు సంబంధించిన దరఖాస్తులను మీసేవలో స్వీకరించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం ప్రభుత్వం ఎలాంటి గైడ్లైన్స్ అవలంభించనుందో దానికి సంబంధించిన మార్గదర్శకాలతో పాటు ప్రొఫార్మాను సైతం విడుదల చేసింది. ఐదు ఎకరాల భూమికి ఎలాంటి స్టాంప్డ్యూటీ అవసరం లేదని, ఐదు ఎకరాలు దాటితే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని ప్రభుత్వం పేర్కొంది. 2014 జూన్ 2వ తేదీ నాటికి తెల్లకాగితంపై లావాదేవీలు చేసుకున్న వాటికి క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు హెచ్ఎండిఏ, కుడాలలోని గ్రామీణ స్వభావం కలిగిన ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2016, 17 సంవత్సరాల్లో రెవెన్యూ శాఖ వెసులు బాట కల్పించిన గ్రామాలు, మండలాల్లో సాదాబైనామాలకు ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది.
పట్టాదారు పాసుపుస్తక చట్టం 1971 ఆధారంగా
అయితే గ్రామీణ ప్రాంతాలతో పాటు హెచ్ఎండిఏ, కుడాలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే సాదాబైనామాలు వర్తిస్తాయని, పట్టణాలు, నగరాలకు వర్తించవని ప్రభుత్వం తెలిపింది. పట్టాదారు పాసుపుస్తక చట్టం 1971 ఆధారంగానే సాదాబైనామాలను క్రమబద్ధీకరించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. సాదాబైనామాలకు సంబంధించి ఈనెల 12వ తేదీన 111 జిఓను ప్రభుత్వం జారీ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మార్గదర్శకాలు ఇవి…
2014 జూన్2వ తేదీ లోపు జరిగిన సాదాబైనామా (తెల్లకాగితంపై) జరిగిన ఒప్పందాలకు మాత్రమే క్రమబద్ధీకరణ చేయాలి.గ్రామాల్లో ఉన్న వ్యవసాయ భూములకే అవకాశం. కొనుగోలుదారులు సన్నకారు లేదా చిన్నకారు రైతులయితేనే అవకాశం ఇవ్వాలి. హెచ్ఎండిఏ, కాకతీయ అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సాదాబైనామాలు చెల్లుబాటు కావు. దరఖాస్తుల స్వీకరణ మీసేవ కేంద్రాల ద్వారానే జరగాలి.
దరఖాస్తుకు ఇవి తప్పనిసరి
ఆధార్కార్డు, సాదాబైనామా (తెల్లకాగితాలపై చేసుకున్న ఒప్పందాలు), కొనుగోలు, విక్రయదారుడి పట్టాదారు పాసు పుస్తకాలు ఉంటే వాటిని కూడా సమర్పించాలి. సాదాబైనామామై ఒప్పందం చేసుకున్నట్టు చూపించే ఏ ఆధారమైనా పొందుపరచవచ్చు. మీసేవలో దరఖాస్తు చేసుకోగానే ఫీజు చెల్లింపుతో పాటు రసీదును తీసుకోవాలి.
హెచ్ఎండిఏ పరిధిలోని మండలాల జాబితా
ప్రస్తుతం సాదాబైనామాలను చేసుకోవడానికి హెచ్ఎండిఏ పరిధిలోని మండలాల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. వాటికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రెవెన్యూ శాఖ జిఓ 294, తేదీ 19.12.2016లో ప్రకటించిన జాబితా ఆధారంగా ప్రభుత్వం ఈ మండలాలకు అనుమతి ఇచ్చింది.
జిల్లా మండలాలు
మెదక్ మనోహరబాద్, నర్సాపూర్, శివంపేట, తూప్రాన్
మేడ్చల్ మల్కాజిగిరి దుండిగల్/గండిమైసమ్మ, ఘట్కేసర్, కీసర, మేడ్చల్
రంగారెడ్డి చేవెళ్ల, ఫరూఖ్నగర్ (పార్ట్), కందుకూరు, కొత్తూరు, యాచారం (పార్ట్)
సంగారెడ్డి గుమ్మడిదల, హత్నూర్ (పార్ట్), జిన్నారం, కండి
సిద్దిపేట మార్క్కుక్ (పార్ట్), ములగు, వర్గల్
యాదాద్రి భువనగిరి బీబీనగర్, బొమ్మలరామారం, భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి మండలాలు ఉన్నాయి.
పలు గ్రామాల్లో సాదాబైనామాలకు అవకాశం
జిఓ 33, తేదీ 04.02.2017 రెవెన్యూ శాఖ ప్రకటించిన జాబితా ప్రకారం పలు మండల్లాలోని పలు గ్రామాల్లో సాదాబైనామాలను అంగీకరిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
జిల్లా మండలం గ్రామాలు
రంగారెడ్డి ఫరూఖ్నగర్ ఆల్సభగూడ, బుచ్చిగూడ, దూస్కల్, ఎలికట్టె, కొద్దన్నగూడ, మొగిలిగిద్ద, నాగులపల్లి, రంగసముద్రం, సూర్యారగూడెం, వెలిజెర్ల
యాచారం యాచారం
సంగారెడ్డి హత్నూర్ అక్వంచగూడ, బోర్పట్ల, చాంద్పూర్, చింతలచెరు, దౌల్తాబాద్
సిద్దిపేట మార్కుక్ దామరకుంట, కర్కపట్ల, మార్కుక్, పాములపర్తి గ్రామాలు ఉన్నాయి.