Sunday, April 28, 2024

నారీశక్తి, సైనిక పాటవానికి సలామ్..

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ కర్తవ్యపథ్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

అందరినీ ఆకట్టుకున్న కవాతు

ఊపిరి బిగపట్టేలా చేసిన మహిళల వీర విన్యాసాలు

తొలిసారి మోగిన బిఎస్‌ఎఫ్ మహిళా బ్యాండ్

అయ్యారే అనిపించిన యుద్ధ విమానాల విన్యాసాలు

వీర తెలంగాణ త్యాగాల ప్రతీకగా రాష్ట్ర శకటం

సైనిక వందనం స్వీకరించిన రాష్ట్రపతి ముర్ము
ముఖ్యఅతిథిగాఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్

ప్రత్యేక ఆకర్షణగా మోడీ

న్యూఢిల్లీ : భారతదేశ సర్వసత్తాక, ప్రజాస్వామిక, గణతంత్ర దినోత్సవ వజ్రోత్సవం 75వ వేడుకలు దేశ రాజధానిలో సగ ర్వ రీతిలో జరిగాయి. శుక్రవారం ఓ వైపు ఆసేతుహిమాచలం త్రివర్ణ పతాకం రెపరెపల దశలోనే స్థానిక కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే వేడుకలు పలు ప్రతీకాత్మక కీర్తి దాయక సంకేతాల నడుమ సాగాయి. జాతీయతా భావోద్వేగం అణువణువునా రంగరించుకుని దేశం గుండెస్పందనను ప్రతిఫలించాయి. ప్రత్యేకించి మహిళా సాధికారికత, మహిళా శక్తి, సుసంపన్న సాంస్కృతిక వారసత్వం అడుగడుక్కి ఉట్టిపడింది. మరో వైపు శత్రువును దడదడలాడించే రీతిలో దేశ రక్షణ వ్యవస్థ, సైనిక పాటవాల ప్రదర్శన, ఈ నేపథ్యంలో ఆద్యంతం ఆకట్టుకునే రీతిలో సాగిన కవాతులు, పలు రకాల సాహసవిన్యాసాలు ఆహుతులను కట్టిపడేశాయి. క్షిపణులు, యుద్ధ విమానాలు, పర్యవేక్షక, నిఘా ఆయుధాలు, పరికరాలు, మారణాయుధాల వ్యవస్థలు వంటివి ఈ పరేడ్‌లో ప్రదర్శించారు. దేశ బలీ య ఆత్మరక్షణ శక్తి జాతికి మరోసారి పరిచయం చేయడం ద్వారా త్రివిధ బలగాలు తమ వంతుగా దేశ ప్రజలకు భరోసా కల్పించాయి. ఈసారి రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఫ్రాన్స్ అధ్యక్షు లు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్ హాజరయ్యారు. దేశ రాజధాని నడిబొడ్డున ఉండే కర్తవ్యపథ్ పరేడ్‌కు కేంద్రం అయింది. ముందుగా దేశ త్రివిధ బలగాల సర్వసేనాని, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ సైనిక వందనం పొందిన తరువాత పరేడ్ సందడి ఆరంభం అయింది. ప్రధాన అతిధి మెక్రాన్ తోడురాగా రాష్ట్రపతి ముర్మూ ప్రెసిడెంట్ బాడీగార్డుల దళం నుంచి అభివాదాలు పొందుతూ సాంప్రదాయక గుర్రాల బగ్గీలో కవాతు సందర్శనకు బయలుదేరారు.
పొగమంచును లెక్కచేయని వెల్లివిరిసిన స్ఫూర్తి
దేశ రాజధానిలో పూర్తిగా శీతాకాలం దట్టమైన పొగమంచు అలుముకున్నా, కాంతి పల్చటి పొరగా నిలిచి ఉన్నా గణతంత్ర వేడుకలకు తరలివచ్చిన వేలాది మంది స్ఫూర్తి, ఉత్సా హం ప్రతిబంధకాలను ఛేదించింది. పరేడ్‌ను వీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పలువురు ఇతర కేంద్ర మంత్రులు , దేశ సైనిక బలగాల అగ్రశ్రేణి అధిపతులు , విదేశీ దౌత్యవేత్తలు , వివిధ విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు ఇతరులు మరోవైపు హోరెత్తే కెరటాల వంటి జనసమూహం నేపథ్యంలో పరేడ్ జరిగింది. ప్రధాని మోడీ బహుళరంగుల బంధని ప్రింట్ సఫాను ధరించి వచ్చిన దశలో జనం ఆయనకు చప్పట్లు, భారత్ మాతాకీ జై నినాదాలతో స్వాగతం పలికారు. గణతంత్ర దినోవ్సవం నేపథ్యంలో భారతదేశపు రాజధానిలో సాగే కవాతు ఈ దశలో అంతర్లీనంగా జరిగే సైనిక పాటవాల ప్రదర్శన, సాంస్కృతిక ప్రతీకల సందడి జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా విశేష ఆసక్తిని రేపాయి.
త్రివిధ బలగాలనుంచి మహిళా సైనిక దళం
ఎవరికి తాము తీసిపోం, ఎంతటి క్లిష్ట దుర్భర భౌగోళిక పరిస్థితుల్లో అయినా రక్షణ దేశ భద్రత రంగంలో ముందుకు పోతాం అని దేశ మహిళ చాటింది. ఈ క్రమంలో కేవలం మహిళా సైనిక దళంతో కూడిన త్రివిధ బలగాల ప్రాతినిధ్యపు దళం అందరిని ఆకట్టుకుంది. తిరుగుబాటుదార్లు, చొరబాటుదార్ల బెడద ప్రాంతాలలో, సియాచిన్ గ్లేసియర్, ఎడారులలో ప్రతికూలతను అధిగమిస్తూ విధినిర్వహణలో సాగే సైనిక మహిళా బృందం తన ఘనతను ఈ పరేడ్‌లో చాటుకుంది. ఇక సాయుధ బలగాలకు చెందిన మెడికల్ సర్వీసెస్ నుంచి కూడా తొలిసారి కేవలం మహిళలతో కూడిన బృందం ప్రాతినిధ్యం వహించింది.
సాహసవిన్యాసాల పిడుగులు
రిపబ్లిక్ డే సంబరాల నడుమ మహిళా జవాన్లు మోటారు బైక్‌లపై సాగించిన అత్యద్భుత ఆద్యంతపు సాహసాల విన్యాసాలు అయ్యారే అన్పించాయి. 265 మంది మహిళలు ఈ బైక్ విన్యాసాలలో పాల్గొన్నారు. అందరిని ఊపిరి బిగపట్టుకునేలా చేశారు. ఈ విన్యాసాల దశలో ప్రేక్షకుల నుంచి చప్పట్లు ఆకాశానికి అంటాయి. ఈ మహిళా వీరవిన్యాసాలలో బైక్‌లపై వారు సాగించిన స్టంట్లు వారి మొక్కవోని ధైర్యానికి సంకేతం అయ్యాయి. ఇంటింటి వంటింటి మహిళ కాదు, దేశ రక్షణలో ఎంత ముందుకు, ఎంతటి సాహసానికి అయినా వెనుకంజ వేయని మహిళ అనే శక్తిని ఈ విన్యాసాలు చాటాయి. ఈ దశలోనే వీరు భారతీయ విలువలు, సంస్కృతి యోగా వంటి సందేశాలు వెలువరించారు. దేశమంటే కలిసికట్టు తనం అంతకు మించిన సంఘటితం అనే నినాదం వెలువరించారు. భారతీయ నౌకాదళం కూడా ఈసారి నారీశక్తినే శకటం రూపంలో ముందుకు తీసుకువచ్చింది. తొలిసారిగా ఈసారి బిఎస్‌ఎఫ్ మహిళా బ్యాండ్ మోగింది. ఎస్‌ఐ శ్వేతా సింగ్ సారధ్యంలో ఈ సంగీత హోరు సాగింది. సిఆర్‌పిఎఫ్, ఢిల్లీ పోలీసు వంటివి కూడా మహిళా శక్తిని చాటాయి. ఇక వందేభారతంనారీ శక్తి బ్యానర్‌తో 1500 మంది డాన్సర్ల బృందం తమ ప్రతిభను చాటింది. వీరు 30 రకాల విశిష్ట జానపద నృత్య శైలులతో ఆకట్టుకున్నారు. కూచిపూడి, కథక్, భరతనాట్యం, సాత్రియా, మోహినియట్టం, ఒడిస్సి, మణిపురి వంటి శాస్త్రీయ నృత్యాలతో పాటు పలు బాలీవుడ్ పాటల డాన్స్‌లు కూడా హోయలుహోయలుగా సాగాయి. కవాతును నిరంతర స్థాయి వేడుకల ఘట్టంగా మార్చాయి.
46 యుద్ధవిమానాల విన్యాసాలు
కవాతు దశలో ప్రేక్షకులను ఆద్యంతం ఆకాశం వైపు దృష్టి మళ్లించే విధంగా భారతీయ వాయుదళపు అత్యద్భుత విన్యాసం సాగింది. వాయుసేనకు చెందిన 46 యుద్ధ విమానాలతో పలు సాహస విన్యాసాలు సాగించారు. ఇందులో 29 ఫైటర్ విమానాలు, ఏడు రవాణా విమానాలు, తొమ్మిది హెలికాప్టర్లు, ఒక హెరిటేజ్ విమానం పాల్గొంది. ఆకాశలోనే ఇవి పలు రకాల గిరికిలు కొట్టడం, సరుకుల చేరవేతలు వంటి ఘట్టాలు అయ్యారే అన్పించాయి. కవాతు వేదిక కర్తవ్యపథ్‌కు రాష్ట్రపతి ముర్మూ రాగానే త్రివర్ణపతాకం ఎగురవేశారు, తరువాత జాతీయ గీతాలాపనం జరిగింది. ఓ వైపు 21 గన్ శాల్యూట్ ప్రక్రియ దేవీయ 105 ఎంఎం ఇండియన్ ఫీల్డ్ గన్స్‌తో సాగాయి. ఇక ప్రేక్షకులకు అభివాదాల రీతిలో 105 హెలికాప్టర్ యూనిట్‌కు చెందిన నాలుగు ఎంఐ 17 హెలికాప్టర్లలో పూల వర్షం కురిపించారు. ఆ వేంటనే ఆహుతులను ఆకట్టుకునే ఆవాహన్ సంగీత సృష్టి జరిగింది.

Republic Day Parade

Telangana Tabloid

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News