Monday, April 29, 2024

సత్యజిత్ రే కు వందేళ్లు

- Advertisement -
- Advertisement -

Satyajit Ray's 100th birth anniversary

 

భారత రత్న, ఆస్కార్ విజేత, చిత్రకారుడు, స్వరశిల్పి, కథానికా రచయిత, మానవతావాది సత్యజిత్ రే (1921-1992) భారతీయ సమాజపు నలుపు తెలుపుల్ని కళాత్మకంగా ప్రపంచానికి అందించారు. సృజనాత్మకతకు అంతర్జాతీయ స్థాయి లో అత్యున్నతమైన అవార్డులు అధికంగా అందుకున్న భారతీయుడు ఎవరూ అని ప్రశ్నించుకుంటే, సత్యజిత్ రే ఒక్కరే అని సమాధానమిచ్చుకోవాల్సి ఉంటుంది. జీవిత కాలంలో చేసిన నిర్విరామ కృషికి ఆయనకు 1992లో ప్రత్యేక ఆస్కార్ అవార్డు లభించింది. ప్రత్యేక ఆస్కార్ అవార్డు ఇంత వరకు వేళ్ల మీద లెక్కించగలిగే ఐదారుగురికి మాత్రమే లభించింది. గ్రేట్ గార్బో (1995), కారీ గ్రాంట్ (1969), చార్లీ చాప్లిన్ (1972), జేమ్స్ స్టువర్ట్, అకిరా కురసోవా (1989). ఇది మామూలుగా లభించే ఆస్కార్ లాంటిది కాదు. దాని కంటే ఎన్నో రెట్లు విలువైంది.

ఒక రకంగా ప్రపంచ చలన చిత్ర పరిశ్రమలో ఇదొక నోబెల్ బహుమతి లాంటిది. నిజానికి అంతకంటే ఎక్కువ నోబెల్ బహుమతులు ప్రతి సంవత్సరం ఇస్తారు. ప్రత్యేక ఆస్కార్ అలా ఇవ్వరు. “అర్హత ఉన్నవారు” అని అనిపించినప్పుడే అప్పుడప్పుడు ఇస్తారు. దీని కంటే ఉన్నతమైంది ప్రపంచంలో ఇక లేదు. న్యూయార్క్ అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ నుండి టెలిగ్రాం అందగానే తనకు ఎప్పుడూ కలగని ఒక విస్మయానందం కలిగిందని రే చెప్పుకున్నారు. అది తను ఊహించని గౌరవమని చెపుతూ, అందుకు కారణం కూడా చెప్పుకున్నారు. ఇతర పాశ్చాత్య చలన చిత్ర దర్శకుల సినిమాల వలె తన చిత్రాలు ప్రపంచంలో ప్రాచుర్యం పొందలేదని, పైగా బెంగాలి భాషకు పరిమితమై పోవడం వల్ల, తన దేశ ప్రజలకే సరిగా అందలేదనీ ఆయన అసంతృప్తి వ్యక్తపరిచారు. ఆ సంతృప్తిని తగ్గించుకోవడానికి ఇక తను ఎక్కువగా హింది, ఇంగ్లీషు భాషలలో సినిమాలు తీస్తానని కూడా ప్రకటించారు.

“షత్రంజ్‌కి కిలాడి” (చదరంగం ఆటగాళ్లు) అనే హిందీ సినిమా 1977 లో తీశారు. కాని, ఆయన జీవిత సినిమా ఆ తర్వాత కొద్ది కాలానికే పరిసమాప్తమైంది. చివరి దశలో రే తీసిన సినిమాలన్నీ గతి తప్పాయని ఒక తీవ్రమైన విమర్శ ఉంది. దానికి ఆయన చెప్పుకున్న సమాధానం కూడా సబబుగానే ఉంది. 1989కి ముందు గుండెపోటుతో తను తీవ్రమైన అస్వస్థతకు గురైనప్పుడు డాక్టర్లు తనను షూటింగ్‌కు అనుమతిచ్చేవారు కాదని, అవుట్ డోర్ షూటింగ్ తగ్గించి, తన ఆరోగ్యానికి, మానసిక సంసిద్ధతకు సరిపోయే కథల్ని తగిన పరిసరాల్ని మాత్రమే ఎన్నుకున్నానని, అందువల్ల తన కృషి ఒక పరిధిలో బిగించినట్టయిందనీ ఆయన చెప్పుకున్నారు. ఆయన తొలి చిత్రాలలో పోలిస్తే చివరి రోజుల్లో తీసినవి భిన్నంగానే ఉన్నాయి. ఏ కళాకారుడైనా జీవితాంతం ఒకే పద్ధతికి అలవాటు పడి పని చెయ్యాలని కూడా ఎక్కడా లేదు కదా! అయితే అన్ని వేళలా కళాత్మక విలువలు నిలబెట్టడం చాలా అవసరం! ఆ పనిని ఆయన జీవితాంతం కొనసాగిస్తూ వచ్చారు.

‘పథేర్ పాంచాలి’ తో మొదలుకుని ‘ఆగంతుక్’ దాకా గల సుదీర్ఘమైన ప్రయాణంలో ఆయన ఎన్నడూ అలసిపోలేదు. ప్రత్యేక ఆస్కార్ అందిన తర్వాత కూడా సినిమాలు తీయడం తనకు అత్యంత ప్రీతిపాత్రమైన విషయమని, పైగా అన్ని పనులు తనే చేసుకుంటూ ఉండడంలో గొప్ప సంతృప్తి ఉందని ఆయన ఆనందంగా ప్రకటించుకున్నారు. జీవిత కాలంలో ఆయన తన చిత్రాలకు తనే స్క్రిప్టు రాసుకున్నారు. సంగీతం సమకూర్చుకున్నారు. కాస్టూమ్స్ డిజైన్ చేసుకున్నారు. సినిమాటోగ్రఫీ.. వగైరా వీలైనన్ని ఎక్కువ పనులు ఆయన చేసుకునేవారు. ఇతరులపై ఆధారపడడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. ప్రతి చిన్న వివరమూ కాగితంపై రాసుకుని, స్కెచ్‌లు గీసుకుని.. షూటింగ్ ప్రారంభించే దర్శకులు బహుశా ప్రపంచంలోనే ఒకరిద్దరున్నారు. ఈ విషయం లో జపాన్ చలన చిత్ర దర్శకుడు అకిరా కురసోవాకు సత్యజిత్ రే కు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. సత్యజిత్ రే అనగానే దారిద్య్రాన్ని భూతద్దాల్లో చూపించే దర్శకుడని కొందరు అభిప్రాయ పడుతుంటారు.

భారతీయ సమాజాన్ని కేంద్రంగా తీసుకున్నప్పుడు అందులోని అన్ని విషయాలు వాటంతట అవే చోటు చేసుకుంటాయి. నిజానికి ‘పథేర్ పాంచాలి’ తర్వాత ఒకటి రెండు తప్ప దారిద్య్రాన్ని ప్రత్యేకంగా చూపిన సినిమాలు లేవు. అలాగే ఉన్నత కుటుంబాల గూర్చి, వారి సమస్యల గూర్చి తీసిన ‘జల్సాఘర్’ (విలాస గృహం) లాంటి సినిమాలు కూడా ఉన్నాయని మనం మరిచిపోగూడదు. సరైన అవగాహన లేని వాళ్లు ఏదో ఒక అపోహకు గురవుతూ ఉంటారు. క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వారికి ఇలాంటి అనుమానాలు రావు. 2 మే 1921న కలకత్తాలో జన్మించిన సత్యజిత్ రే, 23 ఏప్రిల్ 1992న కలకత్తాలోని ఒక నర్సింగ్ హోమ్‌లో కన్ను మూశారు. భారత దేశమే కాదు, చలన చిత్ర ప్రపంచం యావత్తు ఒక కళా స్రష్టను కోల్పోయింది.

ఒక టాగూర్ లేని లోటు ఎంతటిదో, ఒక సత్యజిత్ రే లేని లోటూ అంతటిదే! పుంఖాను పుంఖంగా వెలువడిన ఆయన సినిమా స్క్రిప్టులు, కథానికలు, వ్యాసాలు ఏవీ తెలుగు పాఠకులకు పెద్దగా అందుబాటులోకి రాలేదు. రావల్సిన అవసరమైతే ఉంది. భారతీయ చలన చిత్ర రంగాన్ని ఒక కుదుపు కుదిపి, కొత్త మలుపు తిప్పిన ‘పథేర్ పాంచాలి’ స్క్రీన్ ప్లే ను నేను తెలుగు పాఠకులకు అందించగలిగాను. అందుకు నాకెంతో సంతోషంగాను, గర్వంగాను ఉంటుంది! సమాంతర సినిమాకు సంబంధించిన ఒక కాన్ఫరెన్స్‌లో ప్రొ॥ సతీష్ బహదూర్ నాకు పథేర్ పాంచాలి ఇంగ్లీషు అనువాదం అందించారు. అందువల్ల నేను దాన్ని తెలుగులోకి తేగలిగాను. సతీష్ బహుదూర్ పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్, డైరెక్షన్ డిపార్టుమెంట్‌లో ప్రొఫెసర్.
తన గురించి తాను : (అంతర్జాతీయ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వూల నుండి)

నేను చిత్రకారుడిగా జీవితం ప్రారంభించాను. కళాశాల చదువు పూర్తి చేసి, పట్టా పుచుకున్న వెంటనే టాగూర్ విశ్వవిద్యాలయంలో (శాంతిని కేతన్‌లో) నా పేరు నమోదు చేసుకున్నాను. అయితే దాని కంటే ముందే నాకు సంగీతం మీద ఎనలేని శ్రద్ధ పెరిగింది. ఇటు భారతీయ అటు పాశ్చాత్య సంగీత ధోరణుల్ని బాగా ఆకళింపు చేసుకున్నాను. మొదట సినిమాలు చూడడం ఇష్టంగా ఉండేది. క్రమంగా వాటి పట్ల ఆలోచన ప్రారంభమైంది. చిత్రలేఖనంలో కొంచెం చెయ్యి తిరిగి నిలదొక్కుకున్నారు. ఒక బ్రిటీష్ కంపెనీలో ఆర్టిస్ట్ డిజైనర్‌గా చేరాను. ఉద్యోగ రీత్యా తీరిక లేకపోయినా, నాలో సినిమా మాధ్యమం పట్ల శ్రద్ధ పెరగసాగింది. చివరకు ఇక, సినిమా తీయకుండా ఉండలేనని అనిపించింది. ‘పథేర్ పాంచాలి’ సినిమా షూటింగ్ జరుగుతున్న దశలో నేనింకా ఉద్యోగంలోనే ఉన్నాను.

జీతంలో చాలా భాగం సినిమా షూటింగ్‌ల కోసం వెచ్చించే వాణ్ణి. పథేర్ పాంచాలి విడుదలై కొంత ఆలస్యంగానే విజయం సాధించింది. అప్పుడు గాని, నేను ఉద్యోగం వదలలేకపోయాను. అలాగే సినిమా కోసం పూర్తి సమయం కేటాయించలేకపోయాను. బహుశా ఆ సమయంలోనే నేను రచన కూడా ప్రారంభించాను. నా సినిమాలకు నేను స్క్రిప్టులు రాసుకునే వాణ్ణి. అడపాదడపా కథలు రాసి ప్రచురించే వాణ్ణి. అలాగే నా చలన చిత్రాలకు నేపథ్య సంగీతం కూడా నేనే కంపోజ్ చేసుకోవడం ప్రారంభించాను. కెమెరాతో నాకు కావాల్సిన ఇమేజెస్ వెండి తెర మీద చిత్రించుకోవడం ప్రారంభించాను. కళాకారులు, సంగీతకారులు ఎంతో మంది నాతో కలిసి పని చేస్తుండేవారు. కాని, ప్రతి విషయంలో నా స్వంత ముద్ర ఉండాలని కోరుకునే వాణ్ణి. అన్ని విభాగాలు, అన్ని విషయాలు ఎంత స్వయంగా చూసుకున్నా సహాయకులు లేకుండా పని చేయడం కష్టంగా ఉండేది. కొంత మంది నమ్మదగ్గ మంచి వ్యక్తులు నాకు సినీ జీవితంలో సహకరించారు.

నిజానికి కెమెరామెన్, ఎడిటర్, కండక్టర్ లాంటి వాళ్ల సహాయం లేకుండా, ఒకే వ్యక్తి సినిమా అంతా పూర్తి చేయగలిగితే అది ఎంతో గొప్ప విషయమవుతుంది. అప్పుడు అది అతడి ‘స్వంత చిత్రం’ అని ఘంటాపథంగా చెప్పడానికి వీలవుతుంది. అందువల్ల, ఇప్పుడొస్తున్న చలన చిత్రాలన్నింటిని దర్శకుడి చిత్రాలనడం కొంత వరకు అసమంజసమే! ఒక విమర్శకుడు ఒక చిత్రం గురించి సమీక్ష రాస్తున్నప్పుడు, ఒక దర్శకుణ్ణి మాత్రమే దృష్టిలో ఉంచుకోగూడదు. ఛాయా చిత్ర గ్రాహకుడు, స్క్రిప్టు రచయితల కృషి కూడా అందులో ఉందన్న విషయం మరువకూడదు. వారిరువురి ఉనికి మీదనే దర్శకుడు బతుకుతాడు. నేను నా మాతృభాషలో సినిమాలు తీశాను. బెంగాలీ తెలియని నా దేశస్థులకు నా సినిమాలు అర్థం కాలేదు. విదేశాల్లో నన్ను బాగా అర్థం చేసుకున్నారు. విమర్శలు, ప్రశంసలు, గుర్తింపులూ అ న్ని అక్కడి నుండే ఎక్కువగా వచ్చాయి. అయితే నేను హిందీలో తీసిన సినిమాలు దేశంలోని ప్రజలంతా సంతోషంగా స్వీకరించారు.

చిత్ర నిర్మాణంలో నాకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా ఫరవాలేదు. గొప్ప సంతృప్తి మిగిలింది. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సంవత్సరమే మేం కలకత్తాలో మొదటి ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నాం. మొదటి రెండేళ్లలో 2025 కన్నా సభ్యులు పెరగలేదు. క్లబ్‌కు ఆఫీసు రూమంటూ లేదు. వంతుల వారీగా సభ్యుల ఇళ్లలోనే సమావేశాలు ఏర్పాటు చేసుకునే వాళ్లం. దాని వల్ల ఓ మిత్రుడు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. సినిమా వాళ్లు ఇంటి ‘పవిత్రను’ పాడు చేస్తున్నారని కోపగించి, ఇంటి యజమాని మా మిత్రుణ్ణి ఇల్లు ఖాళీ చేయించాడు. సమావేశాలు జరుపుకోవడానికి సరైన స్థలం దొరికేది కాదు. పైగా, యువకులంతా చేరి దొంగతనంగా సినిమాలు చూసి చెడిపోతున్నారని ఫిల్మ్ క్లబ్ గురించి చెడు ప్రచారం జరిగింది. అయితే తర్వాత కాలంలో పరిస్థితి పూర్తిగా మారింది. దేశమంతటా ఫిలిం క్లబ్‌లు విరివిగా వచ్చాయి. అవి వాటి బులిటెన్స్ ప్రచురిస్తున్నాయి. మా ఫిల్మ్ క్లబ్‌లో ఒక మంచి సినీ సంస్కృతి అవగాహన పెంచడానికి నేను ఎప్పటికప్పుడు చలన చిత్రాల గూర్చి రాస్తూ ఉండేవాణ్ణి. ఫిల్స్ క్లబ్ ప్రారంభించగానే సరిపోదు దాన్ని ఎంత ప్రతిభావంతంగా నిర్వహిస్తే అది సభ్యులలో అంత సృజనాత్మకతను పెంపొందిస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News