కరాచీ : టీమిండియా సారథి విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు కురిపించాడు. తాజాగా సంజయ్ మంజ్రేకర్తో జరిపిన వీడియో చాట్లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘కోహ్లి, నేను బెస్ట్ ఫ్రెండ్స్. కేవలం మైదానం వెలుపల మాత్రమే. మైదానం లోపల బద్ద శత్రువులం. మా ఇద్దరిదీ ఒకే స్వభావం. ఎందుకుంటే ఇద్దరం పంజాబీలం కదా. అతడు నాకన్నా చాలా జూనియర్. కానీ కోహ్లిని గౌరవిస్తాను. కోహ్లి మోడ్రన్ బ్రాడ్మన్. ఇక అతడిని ఔట్ చేయడం చాలా కష్టం. అయితే 150కి.మీల వేగంతో బౌలింగ్ చేయడంతో పాటు క్రీజుకు దూరంగా బంతులు వేసేవాడిని’ అంటూ అక్తర్ వ్యాఖ్యానించాడు.
ఇక అంతర్జాతీయ క్రికెట్లో వీరిద్దరూ ఎప్పుడూ పోటీపడలేదు. అయితే ఆసియా కప్-2010లో భాగంగా భారత్-పాక్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో వీరిద్దరూ ఆడారు. అయితే అక్తర్ బౌలింగ్ను కోహ్లి ఎదుర్కొలేదు. 18 బంతుల్లో 27 పరుగులు చేసిన అనంతరం పాక్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ బౌలింగ్లో కోహ్లి వెనుదిరిగాడు. అయితే కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అక్తర్కు బౌలింగ్ అవకాశం దక్కలేదు. అయితే ఓ సందర్భంలో అక్తర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు నాన్స్ట్రైయిక్లో ఉండటం బెటరని కోహ్లి సరదాగా పేర్కొనగా.. కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తాను బౌలింగ్ చేయకపోవడం ఎంతో లాభించిందని అక్తర్ రిప్లై ఇచ్చాడు.