Monday, April 29, 2024

కరోనా బాధిత గర్భిణులకు భరోసా

- Advertisement -
- Advertisement -

Special facilities in hospitals for corona affected pregnant women

వారి కోసం ఆస్పత్రుల్లో ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు, వార్డులు : మంత్రి హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వేళ గర్బిణుల సంరక్షణ కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్యాన్ని అందించేలా ఏర్పాట్లు చేసింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన గర్భిణుల కోసం అన్ని ఆసుపత్రు ల్లో ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, వార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీరితో పాటు కరోనా సోకిన ఇతర బాధితులకు అత్యవసర సేవలు, శస్త్ర చికిత్సలు అందించేందుకు కూడా ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్, వార్డు కేటాయించాలని ఆదేశించింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డిఎంఇ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావులతో కలసి అన్ని జిల్లాల డీఎంహెచ్‌ఒలు, డీసీహెచ్‌ఒలు, టీచింగ్ ఆసుపత్రి సూపరింటెండెంట్లు, యుపిహెచ్‌సి, పిహెచ్‌సిల వైద్యాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, ఆసుపత్రుల సన్నద్దత తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… కొవిడ్ పాజిటివ్ వచ్చిన గర్భిణులకు అన్ని ఆసుపత్రుల్లో చికిత్స అందించాలని, దీనికి అనుగుణంగా ప్రతీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక ఆపరేషన్ థియేటర్, వార్డును ప్రత్యేకంగా కేటాయించాలని ఆదేశించారు.

అన్ని సౌకర్యాలు ఉండి కూడా, అనవసరంగా వారిని ఇతర ప్రభుత్వ పెద్దాస్పత్రులకు రిఫర్ చేయవద్దని అన్నారు. అదేవిధంగా అత్యవసర సేవలు, శస్త్రచికిత్సలు అవసరమైన వారిని కొవిడ్ సోకిందని చికిత్స అందించేందుకు నిరాకరించవద్దని, వారి కోసం కూడా ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్, వార్డును ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వైద్యాధికారులు క్షేత్ర స్థాయి పర్యటన చేయాలని, పరిస్థితులను తెలుసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో అన్ని ఆసుపత్రులకు అసవరమైన వైద్య పరికరాలను అందించడం జరిగిందని, అవి పూర్తి వినియోగంలో ఉండేలా చూడాలని అన్నారు.

ఆదివారం బస్తీ దవాఖానలు, పిహెచ్‌సి, సబ్ సెంటర్ సేవలు

కరోనా తగ్గుముఖం పట్టే వరకు బస్తీ దవాఖానాలు, పిహెచ్‌సిలు, సబ్ సెంటర్లు ఆదివారం కూడా పని చేయాలని మంత్రి అన్నారు. వ్యాక్సినేషన్, పరీక్షలు, హోమ్ ఐసొలేషన్ కిట్ల పంపిణీ జరగాలని తెలిపారు. లక్షణాలతో ఎవరు వచ్చినా పరీక్ష చేసి, లక్షణాలు ఉంటే కిట్ ఇచ్చి పంపాలని పేర్కొన్నారు. కేంద్రం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రతీ పిహెచ్‌సిలో రాత్రి 10 గంటల వరకు వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పిహెచ్‌సిలో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. కరోనా వచ్చి సాధారణ లక్షణాలు ఉన్నవారికి కిట్లు ఇవ్వడంతో పాటు, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఉండాలని చెప్పారు. అవసరమైతే వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని తెలిపారు.

వ్యాక్సినేషన్ వందకు వంద శాతం పూర్తి కావాలి

వాక్సినేషన్‌లో దేశంలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉండాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ వాక్సిన్ రెండు డోసులు ఇవ్వాలని, అందుకు స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన మున్సిపల్ సిబ్బంది, పోలీసులు, ఇతర విభాగాలకు వంద శాతం బూస్టర్ డోస్ పూర్తి చేయాలని ఆదేశించారు. డిఎంఅండ్‌హెచ్‌ఒలు కలెక్టర్లతో మాట్లాడి మున్సిపల్ సిబ్బంది అందరికీ, జిల్లా ఎస్‌పిలతో మాట్లాడి పోలీసులందరికీ వందకు వంద శాతం బూస్టర్ డోస్ వేసేలా సమన్వయంతో పని చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతీ పిహెచ్‌సి పరిధిలో రెండో డోస్ పెండింగ్‌లో ఉండవద్దని, పిహెచ్‌సి వైద్యులే బాధ్యత తీసుకుని రెండో డోస్ వందకు వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు వైద్యాధికారులను, క్షేత్ర స్థాయి వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

15 -నుంచి 17 ఏళ్ల వారికి వేసే టీకా కార్యక్రమం వేగవంతం చేయాలని తెలిపారు. సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా పిల్లలంతా గ్రామాల్లో ఇంటి వద్దే ఉంటారని, పిహెచ్‌సి వైద్యులు ఇంటింటికి వెళ్లి 15 ఏళ్లు దాటిన పిల్లలందరి వాక్సిన్ ఇవ్వాలని అన్నారు. క్లిష్టమైన సమయంలోనే బాధ్యతతో ప్రజలకు సేవలందిస్తూ ప్రజలకు ధైర్యం ఇవ్వాలని తెలిపారు. వాక్సినేషన్ అందరికీ ఇవ్వడం ద్వారా రక్షణ కవచాన్ని మనమే ఏర్పాటు చేయాలని అన్నారు. కరోనా నుండి ప్రజలను రక్షించేందుకు అవసరమైన అన్నింటినీ ముఖ్యమంత్రి సమకుర్చుతున్నారని, 2 కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోం ఐసోలేషన్ కిట్లు సమకూర్చుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలకు పూర్తి స్థాయిలో నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత మనపై ఉందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News