హైదరాబాద్ : వైకుంఠ ఏకాదశి రోజున రాధాకృష్ణ శోభాయాత్ర జరగడం హర్షనీయమని ఆర్థికమంత్రి హరీష్రావు పేర్కొన్నారు. హైదర్ నగర్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో రాధాకృష్ణ శోభాయాత్రను మంత్రి హరీష్రావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవజాతికి శుభం జరగాలని ఆయన ఆకాంక్షించారు. అందరూ భగవన్నామస్మరణలో ఉండటం వల్ల మనశ్శాంతి లభిస్తుందన్నారు. మనం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఆధ్యాత్మికత అవసరమని హరీష్ రావు పేర్కొన్నారు. ఎంత ఎదిగినా, ఎంత సంపాదించినా ఆధ్యాత్మిక భావన లేకపోతే మానసిక ప్రశాంతత ఉండదన్నారు.
రూపం ఏదైనా భగవంతుడితో మానవుడికి సంబంధం కలిగి ఉండాలని అప్పుడే ప్రశాంతత నెలకొంటుందన్నారు. నగర జీవనంలో వేగం పెరిగింది, పని ఒత్తిడి పెరిగిందని, వీటి నుంచి కొంత రిలీఫ్ కావాలంటే ఆధ్యాత్మికతతోనే అది సాధ్యమవుతుందన్నారు. ఇస్కాన్ సంస్థ ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. మన సంప్రదాయాలే ప్రపంచంలోనే మిన్న అని, మనదేశంలో కుటంబ వ్యవస్థ బాగుందని, దానిని ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.