న్యూఢిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ‘ స్పుత్నిక్ వి’ అతి త్వరలో భారత దేశానికి రానుంది. తొలి బ్యాచ్ టీకా డోసులు మే 1న భారత్కు చేరుకోనున్నట్లు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డిఐఎఫ్) హెడ్ కిరిల్ దిమిత్రీవ్ చెప్పారు. అయితే తొలి కన్సైన్మెంట్లో ఎన్ని టీకాలు ఉండనున్నాయి.. వాటిని ఎక్కడ తయారు చేయనున్నారు అనే విషయాలపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ‘ మే 1వ తేదీన తొలి డోసులు భారత్కు డెలివరీ అవుతాయి’ అని మాత్రమే ఆయన చెప్పారు. కాగా వేసవి చివరి నాటికి భారత్లో నెలకు 50 మిలియన్ డోసుల చొప్పున టీకాలు తయారు చేసే అవకాశాలున్నట్లు తెలిపారు. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ కొద్ది రోజలు క్రితమే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్డిఐఎఫ్ సహకారంతో గమలేయా ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ టీకాను భారత్లో తయారు చేసేందుకు రెడ్డీస్ సంస్థతో ఒప్పందం కుదిరింది. అనంతరం రెండు, మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన రెడ్డీస్.. ఇటీవల వినియోగ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ ట్రయల్స్ ఫలితాలను విశ్లేషించిన నిపుణుల కమిటీ భారత్లో స్పుత్నిక్ వి అత్యవసర వినియోగానికి పచ్చ జెండా ఊపింది.