పోలీస్లకు యుపి సిఎం యోగి ఆదిత్యనాధ్ సూచన
లక్నో : మహిళలపై జరిగే ఘోరాలు, అఘాయిత్యాలపై పోలీస్లు కఠిన చర్యలు తీసుకోవాలని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఆదివారం సూచించారు. హత్రాస్లో దళిత యువతి సామూహిక అత్యాచారానికి గురి కావడంపై విపక్షాలు దాడి చేస్తున్న పరిస్థితుల్లో సిఎం ఈ సూచనలు చేయడం గమనార్హం. షెడ్యూల్డు కులాలు, తెగలపై నేరాల పట్ల కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో 2019 డేటా ప్రకారం ఉత్తర ప్రదేశ్లో మహిళలపై జరిగిన నేరాల కేసుల్లో 55.2 శాతం శిక్షలు పడడం దేశం లోనే అత్యధిక రికార్డుగా నమోదైంది. మహిళలపై జరిగిన ఘోరాలు,నేరాలకు సంబంధించి నమోదైన కేసుల్లో 8059 కేసులకు శిక్షలు పడ్డాయి.
ఈ రాష్ట్రం తరువాత రాజస్థాన్లో 5625కేసులకు శిక్షలు పడ్డాయి. ఈలోగా సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చెల్లెళ్లు, కుమార్తెల భద్రతకు ప్రజలు తమ కుటుంబాలతో సమైక్యం కావాలని,అప్పుడు కానీ ప్రభుత్వాలు నిర్లక్షం నుంచి మేల్కోలేవని వ్యాఖ్యానిస్తూ హిందీలో ట్వీట్ చేశారు. అత్యాచారాలు హత్రాస్లో జరిగినా, బారా లేదా బల్రాంపూర్లో జరిగినా బాధ్యతాయుత ప్రభుత్వం రాజకీయాలకు , కులమతాలకు అతీతంగా మహిళల భద్రతకు అంకింతం కావాలని ఆయన పేర్కొన్నారు.