కేంద్రమంత్రి హర్షవర్ధన్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ : విదేశాల్లో తయారైన కరోనా వ్యాక్సిన్లు అక్కడి ట్రయల్స్లో అన్ని విధాలా సమర్థమైనవిగా నిరూపణ అయినప్పటికీ భారత ప్రజలకు సరిపడే విధంగా అవి నిరూపించుకోవలసి ఉందని, ఆయా వ్యాక్సిన్ల భద్రత, రోగనిరోధకతలను నిర్ధారించే బ్రిడ్జింగ్ అధ్యయనాలు సంతృప్తి కరంగా ఉంటేనే భారత్లో వాటికి అనుమతి లభిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ఈమేరకు ఇక్కడ అదనపు నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి అని పేర్కొన్నారు. దీని కోసం చిన్నపాటి, త్వరగా పూర్తయ్యే నమూనా అధ్యయనాలను చేపడతామని వివరించారు. అంతర్జాతీయంగా అనేక సంస్థలు కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో చివరి ఘట్టంలో ఉన్న సమయంలో ఈ ప్రకటన ప్రాముఖ్యతను సంతరించుకుంది. రష్యాకు చెందిన కొవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి కి సంబంధించిన మూడో దశ ట్రయల్స్ భారత్లో చేపట్టే విషయమై ఇప్పటివరకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదని మంత్రి ప్రకటించారు. భారత్లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన కోవిషీల్డ్ , భారత్ బయోటెక్ ట్రయల్స్ చేపట్టిన కొవాగ్జిడ్, జైడస్ క్యాడిలాకు చెందిన జైకోవ్డి, వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్నాయి.