భారతీయ విద్యార్థులకు వ్యోమగామి సునీతా విలియమ్స్ సూచన
వాషింగ్టన్ : కరోనా ప్రభావంతో ఎటూ వెళ్లలేని ఈ పరిస్థితిని ఉపయోగించుకుని ఇంటివద్దనే ఉండి ఏ విధంగా క్రియాశీలకంగా ఉత్పాదక శక్తివంతులం అవుతామో, సమాజానికి ఏ విధంగా అదనంగా అందించగలుగుతామో ఆలోచించాలని అమెరికాలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు భారతీయ అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ సలహా ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆమె విద్యార్థులతో మాట్లాడుతూ భారతీయ విద్యార్థుల అనుభవాన్ని తాను వ్యోమనౌకలో గడిపిన అనుభవంతో పోల్చారు. భారతీయ దౌత్య కార్యాలయం స్టూడెంట్ హబ్ శుక్రవారం నిర్వహించిన ఈ సదస్సు ద్వారా యుట్యూబ్ ,ఫేస్బుక్ ,ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ద్వారా 84000 మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. కక్షలో వ్యోమనౌకలో 322 రోజుల పాటు తాను గడిపిన అనుభవాన్ని ఉదహరిస్తూ ఒంటరితనం కూడా ప్రభావితం కాడానికి సమయం కల్పిస్తుందని, ఏవిధంగా ఉత్పాదకతను పెంచుకోవాలో క్రియాశీలకంగా ఎలా ఉండాలో సమాజానికి ఏం చేయాలో ఆలోచింప చేస్తుందని ఆమె విద్యార్థులకు సూచించారు. మరో వ్యోమగామికి శిక్షణ ఇస్తూ ఆమె హోస్టన్లో తన వంట గది నుంచి ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.