Monday, April 29, 2024

నేడు సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించనున్న మంత్రి పువ్వాడ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రయాణికుల కోసం 50 సూపర్ లగ్జరీ బస్సులను నేడు (శనివారం) రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించనున్నారు. ట్యాంక్‌బండ్ పైన మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు మంత్రి పాల్గొంటారు. ప్రయాణికులకు వేగంగా సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టిఎస్ ఆర్టీసి) నిరంతరం కృషి చేస్తోంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని యాజమాన్యం భావించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.392 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1,016 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసి నిర్ణయించింది. మొదటి విడతలో 630 సూపర్ లగ్జరీ బస్సులు, 130 డీలక్స్, 16 స్లీపర్ బస్సులను టెండర్ల ద్వారా కొనుగోలుకు ఆర్టీసి సమాయత్తం అయ్యింది. ఈ బస్సులన్నీ మార్చి, 2023 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి రానుండగా నేడు 50 బస్సులను ఆర్టీసి అధికారులు ప్రారంభించనున్నారు.

ప్రతి బస్సులోనూ సౌకర్యవంతమైన 36 రిక్లైనింగ్ సీట్లు

కొత్త సూపర్ లగ్జరీ బస్సులకు ట్రాకింగ్ సిస్టంను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని బస్సుల్లో ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయం కల్పించారు. వాటిని టిఎస్ ఆర్టీసి కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైతే పానిక్ బటన్‌ను నొక్కగానే టిఎస్ ఆర్టీసి కంట్రోల్ రూంకు సమాచారం అందుతుంది. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారు. అలాగే ప్రతి బస్సులోనూ సౌకర్యవంతమైన 36 రిక్లైనింగ్ సీట్లతో పాటు ఎల్‌ఈడీ డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత నేపథ్యంలో బస్సుల్లో సెక్యురిటీ కెమెరాల ఏర్పాటుతో పాటు ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంది. దీంతోపాటు అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం (ఎఫ్‌డిఏఎస్) ఏర్పాటు చేశారు.

బస్సులో మంటలు చెలరేగగానే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. ఉష్ణోగ్రత పెరిగిన అలారం ఆటోమెటిక్‌గా మోగుతుంది. అగ్నిప్రమాదాలు జరిగితే ఎఫ్‌డిఏఎస్ విధానం వల్ల వెంటనే చర్యలు తీసుకోవచ్చు. ఈ సూపర్ లగ్జరీ బస్సుల్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయంతో పాటు టివిలను ఏర్పాటు చేస్తారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. టిఎస్ ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, రవాణా, రహదారి, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఎండి విసి సజ్జనార్, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News