మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం 4గంటలకు ప్రగతిభవన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా కొత్త రెవెన్యూ చట్టం,రాష్ట్రంలోని నీటి పారుదల వ్యవస్థను 11 సర్కిళ్లుగా పునర్ వ్యవస్థీకరించే తదితర అంశాలపై మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. అలాగే బడ్జెట్ సమావేశాలు నిర్వహణపై భేటీలో చర్చించి తేదీలను ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల చివరి వారంలోగానీ లేదా మార్చి నెల మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న పట్టణ ప్రగతి వాటి నిర్వహణ తేదీలు, పంచాయతీరాజ్ సమ్మేళనల తీరుతెన్నులు, అదనపు కలెక్టర్ల నిర్వహణ బాధ్యతలపై కూడా చర్చ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. విద్య, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడే వారి కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకరావాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనిపై కూడా చర్చ జరిగే అవకాశముందని సమాచారం. ప్రభుత్వం అమలుచేస్తున్న పలు పథకాలపై చర్చించనున్నారు. అలాగే ఇటీవల కాలంలో సిఎం ప్రకటించిన అంశాలపైనా చర్చజరగనుంది. వీటితో పాటు కొన్ని కీలక నిర్ణయాలపై కేబినెట్ తీర్మానం చేయనున్నట్టు తెలిసింది.
Telangana Cabinet to Meet on Sunday at Pragathi Bhavan