Sunday, April 28, 2024

తెలంగాణకు ఐదు అంతర్జాతీయ అవార్డులు

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు ఐదు అంతర్జాతీయ అవార్డులు
సచివాలయం, యాదాద్రి ఆలయానికి దక్కిన గుర్తింపు
ఈ అవార్డులు తెలంగాణకు గర్వకారణం : సిఎం కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణను ఐదు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. రాష్ట్రంలోని ఐదు నిర్మాణాలకు లండన్‌లోని గ్రీన్ ఆర్గనైజేషన్ అందిస్తున్న గ్రీన్ యాపిల్ అవార్డులు దక్కాయి. సచివాలయం, యాదాద్రి ఆలయం, మొజంజాహీ మార్కెట్, దుర్గం చెరువు, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాలకు ఈ అరుదైన గౌరవం లభించింది. భారత్‌కు గ్రీన్ యాపిల్ అవార్డులు రావడం ఇదే ప్రప్రథమమని ఈ సందర్భంగా గ్రీన్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. బ్యూటిఫుల్ వర్క్‌స్పేస్ బిల్డింగ్ కేటగిరీలో తెలంగాణ సచివాలయానికి, హెరిటేజ్ కేటగిరీలో మొజంజాహీ మార్కెట్కు, యూనిక్ డిజైన్ కేటగిరీలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి, స్పెషల్ ఆఫీస్ కేటగిరీలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు, అద్భుతమైన మతపరమైన నిర్మాణాల విభాగంలో యాదాద్రి ఆలయానికి గ్రీన్ యాపిల్ అవార్డులు వచ్చాయి. మే 16వ తేదీన లండన్‌లో జరగనున్న అవార్డుల ప్రదానోత్సవంలో స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ ఈ అవార్డులను అందుకోనున్నారు.

సిఎం కెసిఆర్ హర్షం
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన, పునరుద్దరించిన 5 నిర్మాణాలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకోవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో…. డా.బిఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీ, మొజం జాహీ మార్కెట్‌లు ‘ఇంటర్నేషనల్ బ్యూటీఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డు’లను అందుకోవడం గొప్ప విషయమని సిఎం అన్నారు. పర్యావరణ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన లండన్‌కు చెందిన ప్రతిష్టాత్మక ‘గ్రీన్ ఆర్గనైజేషన్’ ఈ అవార్డులను ప్రకటించడం తెలంగాణకు గర్వకారణమని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఈ గ్రీన్ అవార్డులను దక్కించుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం ద్వారా, తెలంగాణతో పాటు దేశ ఖ్యాతి ఇనుమడించిందని సిఎం తెలిపారు.

నూతన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని, ఎక్కడా రాజీపడకుండా అత్యున్నత ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ నియమాలకు అనుగుణంగా తెలంగాణలో నూతన కట్టడాల నిర్మాణం, పునరుద్దరణ జరుగుతున్నదని, అందుకు ఈ అవార్డులు నిదర్శనమని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. సకల జనుల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన కొనసాగుతున్న నేపథ్యంలో, తెలంగాణ ఆచరిస్తున్న ప్రగతి దారులను దేశం అనుసరిస్తున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ప్రశంసలు తెలంగాణకు వెల్లువెత్తుతున్న విషయాన్ని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ గుర్తు చేసుకున్నారు. ఈ నెల 16న లండన్‌లో ఈ అవార్డులను తెలంగాణ రాష్ట్రానికి అందచేయనున్న సందర్భంగా, ఇందుకు కృషి చేసిన ఆయా శాఖల మంత్రులను, ఉన్నతాధికారులను, సిబ్బందిని సిఎం కెసిఆర్ అభినందించారు.

అసలేంటి గ్రీన్ ఆర్గనైజేషన్…?
ది గ్రీన్ ఆర్గనైజేషన్ 1994లో లండన్‌లో ఏర్పాటైంది. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ గురించి ప్రచారం చేయడంతో పాటు.. ఇందుకు కృషి చేస్తున్న వారిని ఇది గుర్తించి అవార్డులు అందిస్తున్నది. ఈ మేరకు 2016 నుంచి గ్రీన్ యాపిల్ అవార్డులు మొదలుపెట్టింది. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్న సంస్థలు, కౌన్సిల్స్, కమ్యూనిటీలకు ఇది అవార్డులను అందిస్తున్నది. అత్యంత విశాలమైన ప్రదేశంలో ఆకర్షణీయంగా నిర్మించడంతో పాటు ఇతరత్రా విషయాలను పరిగణలోకి తీసుకుని భవన నిర్మాణాలకు ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డులను అందజేస్తున్నది. నివాసాలు, కోటలు, మ్యూజియం, బ్రిడ్జిలు, మతపరమైన స్మారక కట్టడాలు, వారసత్వ కట్టడాలు.. ఇలా వివిధ కేటగిరీల్లో ఈ అవార్డులు ఇస్తున్నది. గతంలో లండన్‌లోని బాఫ్టా (బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్), నేషనల్ మ్యూజియం ఆఫ్ ఖతార్, మలేసియాలోని జలాన్ మహ్కోట ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News