హైదరాబాద్: కరోనా కట్టడికి దేశంలో పకడ్బందీగా పని చేస్తున్న రాష్ట్ర తెలంగాణ అని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కొనియాడారు. అంతర్జాతీయ విమానాలు రద్దు చేయాలని మొదటి కోరింది సిఎం కెసిఆరేనని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా లాక్డౌన్ ప్రకటించింది తెలంగాణ అని పేర్కొన్నారు. మర్కజ్ గురించి కూడా కేంద్రానికి సమాచారం ఇచ్చింది తెలంగాణ అని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ నిర్మూలించడంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. వెయ్యి మందికిపైగా మర్కజ్ వెళ్లినట్లు తెలిసిందని, 160 మందిని తప్ప అందరినీ గుర్తించామని ఈటెల వెల్లడించారు. కేవలం రెండు రోజుల్లోనే ఇంత మందిని గుర్తించామని, పరీక్షలు చేస్తున్నమంటే తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ రోజు గాంధీ నుంచి ఇద్దరు డిశ్చార్జ్ అవుతున్నారని, డిశ్చార్జ్ అయినవారు మరో 14 రోజులు హోంక్వారంటైన్లో ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో ఆరుగురు చనిపోయారన్నారు.