Friday, April 26, 2024

ఇంటర్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

Telangana High Court Green Signal For Inter Exams

హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈనెల 25 నుంచి జరిగే పరీక్షలను ఆపలేమంటూ శుక్రవారం నాడు హైకోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా చివరి నిమిషంలో ఇంటర్ పరీక్షల్లో తాము జోక్యం చేసుకోలేమని,ఇంటర్ బోర్డు పరీక్షలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25 నుంచి జరగాల్సిన ఇంటర్ మొదటి పరీక్షలు రద్దు చేయాలంటూ రాష్ట్ర తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. ప్రమోటైన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించొద్దంటూ న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు.దీనిపై స్పందించిన ధర్మాసనం ఈ నెల 25 నుంచి పరీక్షలు ఉండగా పిటిషన్ వేస్తే ఎలా అంటూ ప్రశ్నించడంతో పాటు చివరి నిమిషంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని సూచించింది.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని విద్యార్థుల భవిష్యత్తు కోసం పరీక్షలను వాయిదా వేయలేమని స్పష్టంచేసింది. దీంతో పిటిషనర్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో 25 నుంచి ఇంటర్ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అధికారులు పరీక్షలను నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు తరుపున న్యాయవాది మాట్లాడుతూ విద్యార్థులు కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు కూడా రాయలేదని, వచ్చే ఏడు కూడా ఏవైనా అవాంతరాలు వచ్చి ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పరీక్షలు కూడా రాయలేకపోతే ఈ విద్యార్థుల నైపుణ్యాలను ఎలా పరిగణించాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. శని, ఆదివారాలు కోర్టుకు సెలవు కావున సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో చివరి నిమిషంలో తాము జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు పేర్కొంది.

హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతించిన ఇంటర్ విద్య జెఎసి

ఇంటర్ పరీక్షల నిర్వహణలో విషయంలో జోక్యం చేసుకోలేమంటూ రాష్ట్ర హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఇంటర్ విద్య జెఎసి ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేస్తూ, పరిస్థితులు చక్కబడిన తర్వాత ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన ఇంటర్ బోర్డు ఆదేశాలను విద్యార్థుల తల్లితండ్రులు స్వాగతిస్తున్నారన్నారు. ఇంటర్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు దృష్ట్యా ఇంటర్ విద్యా జెఎసి ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతలకు కట్టుబడి ఉంటుందన్నారు. ఈక్రమంలో అధ్యాపకులందరూ పరీక్షల నిర్వహణ తమ బాధ్యతగా భావించాలని కోరుతున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News