కశ్మీర్లో ఇద్దరు కూలీల బలి
శ్రీనగర్ : కశ్మీర్లో స్థానికేతరులను గురిచేసుకుని ఉగ్రవాదుల ఘాతకాలు సాగుతూనే ఉన్నాయి. కుల్గాం జిల్లాలో ఆదివారం ఉగ్రవాదులు ఇద్దరు స్థానికేతర కూలీలపై కాల్పులు జరిపారు. దీనితో వారు మృతి చెందారు. ఓ వ్యక్తి వీరి కాల్పులలో గాయపడ్డాడు. వీరు కిరాయికి ఉంటున్న గదులలోకి చొరబడి కాల్పులు జరిపినట్లు వెల్లడైంది. ధారణ పౌరులను, మైనార్టీ వర్గాలను, ఇతర ప్రాంతాల నుంచి జీవనోపాధికి వచ్చిన వారిని ఎంచుకుని కాల్పులకు దిగి వారిని చంపివేసి పారిపోవడం ఉగ్రవాదులకు ఇప్పుడు రోజువారి చర్యగా మారింది. కుల్గాంలోని వాన్పోహ్లో టెర్రరిస్టులు విచక్షణారహితంగా అక్కడున్న కూలీలపై కాల్పులు జరిపారు. ఇద్దరు కూలీలు మృతి చెందగా ఒకరు గాయపడ్డారని పోలీసు అధికారులు తెలిపారు.మృతులు ఏ రాష్ట్రానికి చెందిన వారనేది తెలియచేయలేదు.
ఘటనాస్థలికి వెంటనే భద్రతాబలగాలు చేరుకున్నాయి. ఈ ప్రాంతాన్ని దిగ్బంధించాయి. గడిచిన 24 గంటలలో వేరే రాష్ట్రానికి చెందిన కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి వారి ప్రాణాలు తీయడం ఇది మూడో సారి. ఇప్పటికే బీహార్, యుపిలకు చెందిన వారిని ఉగ్రవాదులు చంపేశారు. జరిగిన ఘటనలపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. చిందిన ప్రతి నెత్తుటి బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని , ఉగ్రవాదులను వారి సానుభూతిపరులను, వివిధ స్థాయిల మద్దతుదార్లను వెంటాడి దెబ్బతీసి తీరుతామని ఆయన తమ నెలవారి ఆవాంకీ ఆవాజ్ రేడియో కార్యక్రమంలో హెచ్చరించారు. ఉగ్రవాదులు తగు మూల్యం చెల్లించుకునేలా చేస్తామని తెలిపారు.